జూన్ 20న రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కొక్కటీ నెరవేరుస్తున్నారు. మొన్న గురువారం తల్లికి వందనం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకం అముల చేయడానికి సిద్దపడుతోంది. ఈ మేరకు రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త తెలిపారు. మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ జూన్ నెల 20 మొదటి విడతగా రూ. 7వేల రూపాయలు రైతుల ఖాతాలో జమచేస్తామని మంత్రి అచ్చెంన్నాయుడు చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో పాటుగా రాష్ట్రం వాటా రూ.5 వేలు కలిపి మొత్తం రూ.7 వేలు ఈ నెల 20న అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కూటమి ప్రభత్వం అధికారంలోకి రాగానే రైతులకు వ్యవసాయ పరికరాలు ఇస్తున్నామన్నారు. రైతుల సంక్షేమమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, రాబోయే ఖరీఫ్ లో రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సన్న బియ్యం రకాలను ఎక్కువగా పండించాలని ఆయన రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూడా రైతులకు 24 గంటల్లోనే ధాన్యం కొలుగోలు డబ్బులను వేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ మేరకు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు.
చివరి ఆకు వరకు పొగాకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. పొగాకు పంటకు బీమా పథకాన్ని మళ్లీ మొదలు పెట్టామని చెప్పారు. అలాగే ప్రమాద బీమాను రూ.7 లక్షలకు పెంచామని, ప్రత్యేక నిధులతో వెంటనే పరిహారం అందేలా చూస్తామన్నారు. గ్రేడ్-ఏ రకం క్వింటాకు రూ.12 వేలు, గ్రేడ్-బీ రకం రూ.5,400 ధర నిర్ణయించామన్నారు. ITC, JPI సంస్థలతో 20 వేల మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని.. మార్క్ఫెడ్ ద్వారా 75 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా కంపెనీలతో కొనుగోలు చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. జగన్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పొగాకు రైతుల మధ్య పొగ పెట్టాలని చూస్తున్నారని.. రైతులు నాణ్యమైన పంటలు పండించి మంచి ధర పొందాలన్నారు.