విమాన ప్రమాద క్షతగాత్రుల్ని పరామర్శించిన ప్రధాని మోడీ
ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్ధలాన్ని పరిశీలించడానికి కొద్ది సేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ చేరుకున్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని ముందుగా ఆసుపత్రికి చేరుకుని విమాన ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ ఒకే ఒక్క విమాన ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ ని ప్రధాని మోడీ పరామర్శించారు. అనంతరం ప్రమాద జరిగిన మెడికల్ కళాశాల పీజీ హస్టల్ వద్దకు వెళ్లి సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన పరిస్ధితులను ప్రధాని నరేంద్ర మోడీకి హోం మంత్రి అమిత్ షా, విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడులతో పాటు అధికారులు కూడా వివరించారు. ప్రమాదం తదనంతరం తీసుకున్న చర్యలపై కూడా ప్రధానికి తెలియజేశారు.
ఇదిలా ఉండగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పలు విభాగాలకు చెందిన నిపుణులతో ప్రభుత్వం హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఎయిర్ ఇండియా బోయింగ్ విమానానికి జరిగిన ప్రమాద కారణాలపై అధ్యయనం చేసి ఇక ముందు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటి వరకూ 265 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రమాదంలో మరణించగా మిగిలిన మృతులు మెడికోలుగా గుర్తించినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు శిశువులతో సహా 13 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తు పట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. డీఎన్ఏ టెస్టులు చేసిన తరువాతే మృతుల వివరాలపై స్పష్టత వచ్చే పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ప్రమాద స్ధలానికి డీజీసీఏ బృందంతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చేరుకున్నారు. ఏయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డీజీ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.