Vedika Pinto: 'లిగ్గీ గర్ల్' నుంచి బాలీవుడ్లో తనకంటూ గుర్తింపు.. వేదికా పింటో సక్సెస్ స్టోరీ!
స్టార్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వేదికా పింటో.. అనురాగ్ కశ్యప్ నేర్పిన జీవిత పాఠాలు, కలల పాత్రలు, బాలీవుడ్లో ఎదురైన సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు
స్టార్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వేదికా పింటో.. అనురాగ్ కశ్యప్ నేర్పిన జీవిత పాఠాలు, కలల పాత్రలు, బాలీవుడ్లో ఎదురైన సవాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: ఒక వైరల్ మ్యూజిక్ వీడియోతో గుర్తింపు సంపాదించి.. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి వేదికా పింటో. లిగ్గీ మ్యూజిక్ వీడియోతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె.. ఇప్పుడు ముసాఫిర్ కేఫేతో ప్రేక్షకుల ప్రేమను అందుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, విజయాలు, బాలీవుడ్లో ఎదురైన సవాళ్లు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ నుంచి నేర్చుకున్న పాఠాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
చిన్నప్పటి కల.. కానీ చెప్పే ధైర్యం లేదు
చిన్నప్పటి నుంచే నటిగా మారాలనే కోరిక ఉండేదని వేదికా తెలిపింది. అయితే తాను చాలా సిగ్గు పడే అమ్మాయిని కావడంతో ఆ కలను బయటకు చెప్పలేకపోయానని చెప్పింది.
యూకేలో పాలిటిక్స్, లిటరేచర్ చదివిన తర్వాత ఇక నటనకు ప్రయత్నించకపోతే జీవితాంతం పశ్చాత్తాపం మిగిలిపోతుందని భావించి 2017లో ముంబైకి వచ్చి ఆడిషన్లు ప్రారంభించినట్లు వెల్లడించింది.
'లిగ్గీ'తో ఒక్కసారిగా ఫేమ్
వేదికా కెరీర్కు అసలైన మలుపు లిగ్గీ మ్యూజిక్ వీడియోతో వచ్చింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఇప్పటికీ చాలామంది తనను "లిగ్గీ గర్ల్"గానే గుర్తుపడతారని తెలిపింది.
ఆ తర్వాత కరోనా కారణంగా కెరీర్కు బ్రేక్ పడినా.. ఆపరేషన్ రోమియో, గుమ్రాహ్, అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన నిశాంచి వంటి చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగింది. ప్రస్తుతం ముసాఫిర్ కేఫే తనకు ప్రేక్షకుల్లో విస్తృత గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పింది.
గాడ్ఫాదర్ లేకపోతే ప్రయాణం అంత ఈజీ కాదు
బాలీవుడ్లో ఎలాంటి గాడ్ఫాదర్ లేకుండానే అడుగుపెట్టానని వేదికా తెలిపింది. 2017లో ప్రారంభమైన తన ప్రయాణానికి దాదాపు తొమ్మిదేళ్ల తర్వాతే ముసాఫిర్ కేఫే ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకుల గుర్తింపు లభించిందని చెప్పింది.
అయితే నిశాంచి సినిమా తనకు ఇండస్ట్రీలో గౌరవాన్ని తీసుకొచ్చిందని తెలిపింది. అనురాగ్ కశ్యప్ సినిమాలో నటించడం వల్ల తనను సీరియస్ యాక్టర్గా ఇండస్ట్రీ చూడటం ప్రారంభించిందని పేర్కొంది.
విజయం అంటే ఇంకా ముందుకు వెళ్లాలనే తపన
తన దృష్టిలో ప్రతి సినిమా ఒక మెట్టు మాత్రమేనని వేదికా తెలిపింది.
ఒక విజయం వచ్చిందంటే అక్కడే ఆగిపోనని, ప్రేక్షకుల ప్రేమ అందుకుంటూనే "తర్వాత ఏంటి?" అనే ఆలోచనే తనను ముందుకు నడిపిస్తుందని చెప్పింది. అదే తన ఆశయానికి, కష్టపడే తత్వానికి నిదర్శనమని వెల్లడించింది.
స్క్రీన్ టైమ్ కాదు.. కథ ముఖ్యం
పాత్ర చిన్నదా, పెద్దదా అనేది తనకు అసలు ముఖ్యమేమీ కాదని వేదికా స్పష్టం చేసింది.
చిన్నప్పటి నుంచి కథలు అంటే తనకు ఎంతో ఇష్టమని, కథ వినిపించకపోతే భోజనం కూడా చేయనని తన తల్లి సరదాగా చెప్పేదని గుర్తుచేసుకుంది.
"చిన్న పాత్రలు ఉండవు.. చిన్న నటులే ఉంటారు" అనే ప్రముఖ నటనా సిద్ధాంతకర్త స్టానిస్లావ్స్కీ మాటలను ఉటంకిస్తూ, నిశాంచిలో తన పాత్రకు తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా ప్రేక్షకులపై ప్రభావం చూపిందని తెలిపింది.
అనురాగ్ కశ్యప్ నేర్పిన జీవిత పాఠం
దర్శకుడు అనురాగ్ కశ్యప్తో పనిచేయడం తన జీవితంలో మరిచిపోలేని అనుభవమని వేదికా చెప్పింది.
ఒకసారి ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో తాను ఆందోళన చెందుతుంటే.. "నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో.. అంతే ప్రేమను నీకు నువ్వూ ఇవ్వు" అని చెప్పారని గుర్తుచేసుకుంది.
ఆ ఒక్క మాట తన జీవితాన్ని మార్చేసిందని.. తనను తాను ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో అప్పుడే అర్థమైందని చెప్పింది.
పాత్రల్లో నన్ను నేనే కలపమన్న దర్శకుడు
దర్శకుడు రుచిర్ అరుణ్ తన నటనపై మరో కొత్త కోణాన్ని చూపించారని తెలిపింది.
ఇప్పటివరకు ప్రతి పాత్రకు వేదికాను పూర్తిగా దూరంగా ఉంచాలని భావించేదాన్నని.. కానీ తన సహజ స్వభావమైన సరదా, ఆప్యాయతను పాత్రలో కలపాలని ఆయన సూచించారని, దాంతో నటనపై తన దృక్పథమే మారిపోయిందని వెల్లడించింది.
నేనే నాకు కఠిన విమర్శకురాలిని
తన నటనను తానే ఎక్కువగా విమర్శించుకుంటానని వేదికా చెప్పింది.
ప్రతి సినిమా, ప్రతి సన్నివేశాన్ని చూసి ఇంకా ఎలా బాగా చేయవచ్చో విశ్లేషిస్తానని తెలిపింది. ప్రస్తుతం తాను చేరాలనుకున్న స్థాయిలో కేవలం 10 శాతం మాత్రమే చేరానని నిజాయితీగా చెప్పింది.
తల్లిదండ్రులే నా బలం
తన తల్లిదండ్రులు లేకపోతే ఈ స్థాయికి వచ్చేదాన్నికాదని వేదికా భావోద్వేగంగా చెప్పింది.
చాలా కాలం పాటు ఆర్థికంగా స్వతంత్రంగా లేకపోయినా.. వారు ఎప్పుడూ తనపై ఒత్తిడి తీసుకురాలేదని, ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని తెలిపింది.
అవుట్సైడర్లపై గౌరవం
ముంబైకి కలలతో వచ్చే ప్రతి నటుడిపై తనకు ఎంతో గౌరవం ఉందని వేదికా తెలిపింది.
తనకు కనీసం ఇంట్లో కుటుంబం అండగా ఉందని, కానీ చాలామంది నటులు అలాంటి పరిస్థితుల్లో ఉండరని పేర్కొంది. కుటుంబాన్ని పోషిస్తూ ఇండస్ట్రీలో నిలబడే వారంటే తనకు ఎంతో గౌరవమని చెప్పింది.
ఇన్సైడర్ కాదు.. ప్రతిభే ముఖ్యం
తన తల్లిదండ్రులు మీడియా రంగంలో పనిచేసినా.. సినీ పరిశ్రమలో మాత్రం లేరని వేదికా తెలిపింది.
తండ్రి జానీ పింటో ప్రకటన చిత్రాలు తెరకెక్కించేవారని, తల్లి మోనియా పింటో టెలివిజన్ కార్యక్రమాల్లో పనిచేశారని చెప్పింది. ఇండస్ట్రీ వాతావరణంలో పెరిగినా.. చివరికి ప్రతిభ, కష్టపడి చేసే పనినే గుర్తిస్తారని అభిప్రాయపడింది.
అదృష్టం కూడా కీలకమే
కేవలం ప్రతిభ, కష్టం మాత్రమే కాదు.. సరైన సమయం, అదృష్టం కూడా నటుడి కెరీర్లో కీలక పాత్ర పోషిస్తాయని వేదికా తెలిపింది.
లీడ్ రోల్స్తో పాటు హారర్ సినిమాలపై ఆసక్తి
భవిష్యత్తులో మహిళా ప్రధాన చిత్రాల్లో నటించాలని ఉందని వేదికా వెల్లడించింది.
ప్రస్తుతం తనకు సైకలాజికల్ హారర్ కథలు ఎక్కువగా వస్తున్నాయని, అలాంటి విభిన్నమైన కథల్లో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
కలల వెంట పరుగెత్తేవారికి సందేశం
నటుడు కావాలనుకునే ప్రతి ఒక్కరికీ వేదికా ఒకే సందేశం ఇచ్చింది.
"ప్రయాణం మధ్యలో ఎన్నో కష్టాలు, నిరాశలు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో అన్యాయం జరిగినట్లు కూడా అనిపిస్తుంది. అయినా మీ కల నిజంగానే నటన అయితే.. ఎప్పుడూ ఆగిపోవద్దు. ముందుకు సాగుతూనే ఉండండి. విజయం ఒకరోజు తప్పకుండా మీ తలుపు తడుతుంది." అని ప్రేరణాత్మకంగా చెప్పింది.