Kamakhya Temple: భక్తులకు అలర్ట్.. కామాఖ్య ఆలయంలో ఆఫ్లైన్ ప్రత్యేక దర్శనాలు రద్దు.. నేటి నుంచే కొత్త రూల్స్..
నేటి నుంచే కొత్త రూల్స్..
Kamakhya Temple: ప్రపంచ ప్రసిద్ధ శక్తి పీఠం, అస్సాంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులకు ఆలయ యాజమాన్య కమిటీ కీలక విజ్ఞప్తి చేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఆఫ్లైన్ ప్రత్యేక దర్శన టిక్కెట్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రత్యేక దర్శనం కావాలనుకునే భక్తులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధన జూన్ 15 (నేటి) నుంచే అమల్లోకి రానుంది. ఆలయ ప్రాంగణంలోని టికెట్ కౌంటర్ల వద్ద ఆఫ్లైన్ బుకింగ్ సేవలను పూర్తిగా నిలిపివేశారు.
సాయంత్రం 6 గంటల నుంచే కొత్త పోర్టల్ ప్రారంభం
ప్రత్యేక దర్శన టిక్కెట్ల బుకింగ్ కోసం జూన్ 15 సాయంత్రం 6 గంటల నుండి ఒక కొత్త ఆన్లైన్ పోర్టల్ భక్తులకు అందుబాటులోకి రానుంది. భక్తులు ఆలయ అధికారిక వెబ్సైట్ను సందర్శించి, తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని (స్లాట్) ఎంచుకుని టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత భక్తులకు డిజిటల్ పాస్ లభిస్తుంది. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్నందున, దర్శన వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి, కౌంటర్ల వద్ద నిరీక్షణ సమయాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంబుబాచి మేళా రద్దీ నియంత్రణకే ఈ ముందస్తు చర్యలు..
నీలాచల్ కొండలపై వెలిసిన కామాఖ్య ఆలయం.. దేశంలోని 51 శక్తి పీఠాలలో అత్యంత పవిత్రమైనది. ప్రతి సంవత్సరం జూన్ నెలాఖరులో ఇక్కడ అత్యంత ప్రసిద్ధ అంబుబాచి మేళా ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు, సాధువులు తరలివస్తారు. ఈ భారీ జనసమూహాన్ని నియంత్రించడానికి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను క్రమబద్ధీకరించడానికి ఆలయ అధికారులు ఈ ఆన్లైన్ విధానాన్ని తప్పనిసరి చేశారు.
ఈ ఆన్లైన్ రూల్ ఎవరికి వర్తిస్తుంది? ఎవరికి వర్తించదు?
సాధారణ భక్తులకు మాత్రమే:
ఈ కొత్త ఆన్లైన్ ప్రత్యేక దర్శన సౌకర్యం కేవలం సాధారణ భక్తులకు, ఇతర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులకు మాత్రమే వర్తిస్తుంది.
స్థానికులకు మినహాయింపు:
ఆలయ అంతర్గత సిబ్బందికి, నీలాచల్ కొండల ప్రాంతంలోని స్థానిక నివాసితులకు ఈ ఆన్లైన్ బుకింగ్ నిబంధన వర్తించదు.
ఆలయ కమిటీ హెచ్చరిక:
పండాల్లు లేదా ఆలయంతో సంబంధం ఉన్న ఇతర స్థానిక బృందాలు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ బుకింగ్లు చేస్తే, వాటిని తక్షణమే రద్దు చేస్తామని ఆలయ యాజమాన్యం కఠినంగా హెచ్చరించింది.