Narayanavanam Temple Brahmotsavams: మే 27న నారాయణవనం ఆలయ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Update: 2026-05-26 10:12 GMT

Narayanavanam Temple Brahmotsavams: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28 నుండి జూన్ 05వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో మే 27వ తేదీ రాత్రి 07.30 గం.లకు అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా స్వామి వారిని ఉదయం 06 గం.లకు సుప్రభాతంతో మేల్కొలిపి పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆలయ ప్రాముఖ్యత

శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి దివ్య దర్శనం దంపతుల జీవితాల్లో సుఖశాంతులు, పరస్పర అవగాహన, కుటుంబ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల అచంచల విశ్వాసం. వివాహం ఆలస్యమవుతున్న యువతీ యువకులు, కొత్తగా వివాహమైన దంపతులు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు స్వామివారి కళ్యాణ కటాక్షం కోసం ఈ క్షేత్రాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.

“శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి”గా ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం భక్తుల హృదయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. దాంపత్య జీవితంలో ఆనందం, అనురాగం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం భక్తులు స్వామివారిని ప్రార్థిస్తుంటారు. శ్రీనివాసుని కళ్యాణ మహిమ జీవితాలను మంగళమయం చేస్తుందనే విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు నారాయణవనానికి తరలివచ్చి స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుతున్నారు.

స్థల పురాణం :

పురాణ ప్రాశస్త్యం ప్రకారం ఆకాశరాజు పరిపాలించిన రాజధానిగా నారాయణవనం వెలుగొందింది. ఇదే పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారితో దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్నాడని స్థల పురాణం వివరిస్తోంది. ఆ దివ్య వివాహ ఘట్టానికి చిరస్మరణగా పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయాన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రం కల్యాణ మహిమను ప్రసరించే పవిత్ర దివ్యక్షేత్రంగా యుగయుగాలుగా భక్తుల ఆరాధనలను అందుకుంటోంది.

గర్భాలయం :

దాదాపు 5.5 ఎకరాల విస్తీర్ణంలో రెండు ప్రాకారాలతో విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. తొలి ప్రాకారంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారు దివ్య మంగళవిగ్రహంతో భక్తులకు దర్శనమిస్తుండగా, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారు, ఉప సన్నిధులు ఆలయ మహిమను మరింత పెంపొందిస్తున్నాయి.

Tags:    

Similar News