Sri Prasanna Venkateswara Swamy: జూలై 30న అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి దివ్య పుష్పయాగం

దివ్య పుష్పయాగం

Update: 2026-07-27 05:19 GMT

Sri Prasanna Venkateswara Swamy: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 30వ తేదీన అత్యంత వైభవంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల అనంతరం ఆలయ పవిత్రత, లోకక్షేమం, భక్తుల సర్వమంగళాల కోసం నిర్వహించే ఈ దివ్యోత్సవం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.

ఈ సందర్భంగా జూలై 29వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు మేధిని పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

జూలై 30వ తేదీ ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీటితో విశేష అభిషేకం చేపడతారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువ తదితర సుగంధ పుష్పాలతో స్వామివారికి వైభవంగా పుష్పయాగం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి వీధి ఉత్సవం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనుంది.

ఇటీవల జరిగిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం నిత్యకైంకర్యాలు, ఉత్సవాల్లో తెలిసీ తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు.

ఈ మహోత్సవం ద్వారా సమస్త దోషాలు తొలగి, లోకానికి శాంతి, సుభిక్షం చేకూరడంతో పాటు భక్తుల సకల మనోరథాలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.

Tags:    

Similar News