Doors of Badrinath Temple Open: భూ వైకుంఠం బద్రీనాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి.. వైభవంగా 2026 చార్ ధామ్ యాత్ర ప్రారంభం..
వైభవంగా 2026 చార్ ధామ్ యాత్ర ప్రారంభం..
Doors of Badrinath Temple Open: భక్తుల నిరీక్షణ ఫలించింది. పవిత్ర హిమాలయాల ఒడిలో కొలువైన శ్రీ బద్రీనాథ్ ధామ్ ద్వారాలు ఈరోజు అత్యంత వైభవంగా తెరుచుకున్నాయి. అక్షయ తృతీయ నాడు యమునోత్రి, గంగోత్రి.. ఏప్రిల్ 22న కేదార్నాథ్ ద్వారాలు తెరిచిన తర్వాత, ఇప్పుడు బద్రీనాథ్ ప్రవేశంతో చార్ ధామ్ యాత్ర పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి వచ్చింది.
పూల వనంగా మారిన ఆలయ ప్రాంగణం
బద్రీనాథ్ ఆలయ ద్వారాల ప్రారంభోత్సవం సందర్భంగా దేశ, విదేశాల నుండి తెప్పించిన సుమారు 25 క్వింటాళ్ల రంగురంగుల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయ జయధ్వానాల నడుమ ద్వారాలు తెరుచుకోగా, రాబోయే ఆరు నెలల పాటు భక్తులకు బద్రి విశాల్ దర్శనం లభించనుంది.
ఏమిటీ భూ వైకుంఠం విశిష్టత?
హిందూ పురాణాల ప్రకారం.. బద్రీనాథ్ను భూ వైకుంఠంగా పిలుస్తారు. సత్యయుగంలో విష్ణుమూర్తి ఇక్కడ కఠోర తపస్సు చేశారని గ్రంథాలు చెబుతున్నాయి. "ఈ విశ్వంలో బద్రీనాథ్తో సమానమైన పుణ్యక్షేత్రం మరొకటి లేదు, రాబోదు" అని భక్తుల అచంచల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి, మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు.
బద్రీనాథ్ - పేరు వెనుక ఉన్న దివ్య గాథ
ఈ క్షేత్రం పేరు వెనుక లక్ష్మీనారాయణుల అపూర్వ ప్రేమ కథ దాగి ఉంది. శ్రీమహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తున్న సమయంలో ఆయనను ఎండవానల నుండి రక్షించడానికి లక్ష్మీదేవి రేగు చెట్టు రూపం ధరించి నీడను ఇచ్చింది. దేవి భక్తికి మెచ్చిన స్వామి, ఈ ప్రదేశానికి తన కంటే ముందే దేవి పేరు వచ్చేలా బద్రీనాథ్ అని నామకరణం చేశారు.
చారిత్రక - ఆధ్యాత్మిక వారసత్వం
అలకనంద నది ఒడ్డున కొలువుదీరిన ఈ ఆలయం 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. జగద్గురు ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి, సనాతన ధర్మంలో ఒక ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దారు. చార్ ధామ్ యాత్రలో బద్రీనాథ్ దర్శనం అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక ప్రశాంతతను వెతుక్కుంటూ వచ్చే లక్షలాది మంది యాత్రికులకు 2026 యాత్ర ఇప్పుడు ఒక మధుర స్మృతిగా నిలవనుంది.