Amarnath Yatra: భక్తులకు శుభవార్త: మళ్లీ ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. బాల్తాల్ మార్గం గుండా తరలివెళ్లిన భక్తులు..
బాల్తాల్ మార్గం గుండా తరలివెళ్లిన భక్తులు..
Amarnath Yatra: తీవ్ర ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా గత 6 రోజులుగా నిలిచిపోయిన పవిత్ర అమర్నాథ్ యాత్ర ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లో వాతావరణం అనుకూలించడంతో నిలిచిపోయిన భక్తుల ప్రయాణానికి అధికారులు అనుమతినిచ్చారు. దీంతో వేలాది మంది భక్తులు జమ్మూ, బేస్ క్యాంప్ల నుంచి బాలాల్ మార్గం గుండా పవిత్ర అమర్నాథ్ గుహ వైపుగా తమ యాత్రను కొనసాగిస్తున్నారు.
6 రోజుల నిరీక్షణకు తెర
జమ్మూ కాశ్మీర్లో కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల వేలాది మంది అమర్నాథ్ యాత్రికులు జమ్మూలోని వివిధ క్యాంప్లలో, భగవతి నగర్ బేస్ క్యాంప్లో నిలిచిపోవాల్సి వచ్చింది. వాతావరణ శాఖ సూచనల మేరకు, మార్గాలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గత 6 రోజులుగా ఎదురుచూస్తున్న యాత్రికుల్లో మళ్లీ ఉత్సాహం నిండింది. "హర్ హర్ మహాదేవ్", "బమ్ బమ్ భోలే" నామస్మరణలతో బేస్ క్యాంప్లు హోరెత్తిపోయాయి.
బాల్తాల్ మార్గం గుండా సాగుతున్న యాత్ర
యాత్ర పునఃప్రారంభం కావడంతో భక్తుల జాతాలు ముందుగా నిర్ణయించిన బాల్తాల్ మార్గం ద్వారా పవిత్ర అమర్నాథ్ గుహ వైపు పయనమయ్యాయి. యాత్రికుల భద్రత కోసం జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా దళాలు మార్గమంతటా విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశాయి.
వైద్య, ప్రాథమిక వసతులు:
యాత్రికులకు దారి పొడవునా తాగునీరు, ఉచిత ఆహారం , అత్యవసర వైద్య సదుపాయాలు మరియు తాత్కాలిక షెల్టర్లను అధికారులు అందుబాటులో ఉంచారు.
అధికారుల ముందస్తు జాగ్రత్తలు
వాతావరణంలో హఠాత్తుగా మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున, శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డ్ (SASB), స్థానిక పరిపాలనా యంత్రాంగం నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. భక్తులు సైతం అధికారుల సూచనలను, భద్రతా మార్గదర్శకాలను తప్పక పాటించాలని, హెచ్చరికలు జారీ చేసినప్పుడు సురక్షిత ప్రాంతాల్లో వేచి ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతరాయం తర్వాత యాత్ర మళ్లీ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.