Nandalur Brahmotsavams: నందలూరు బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవంగా గరుడ వాహనసేవ

గరుడ వాహనసేవ

Update: 2026-07-27 05:21 GMT

Nandalur Brahmotsavams: నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది.

సర్వాలంకార భూషితుడైన శ్రీ సౌమ్యనాథస్వామివారు రాత్రి 7 గంటలకు గరుడునిపై గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనం ప్రసాదించారు.

స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ, “గోవింద… గోవింద…” నామస్మరణలతో గ్రామమంతా భక్తిరసంలో మునిగిపోయింది. భక్తులు స్వామివారి కటాక్షాన్ని పొందుతూ విశేష భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.

గరుడ వాహనసేవ విశిష్టత

వైష్ణవ సంప్రదాయంలో గరుడ వాహనసేవకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. శ్రీమహావిష్ణువు పరమభక్తుడైన గరుడునిపై విహరించడం ద్వారా భక్తులకు శరణాగతి, భక్తి, జ్ఞానం, వైరాగ్యాల సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. గరుడుని దర్శించడం వల్ల పాప విమోచనం కలిగి ఆధ్యాత్మిక పురోగతి సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ వాహనసేవలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News