Sri Prasanna Venkateswara Swamy: అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పుష్పయాగ మహోత్సవం

పుష్పయాగ మహోత్సవం

Update: 2026-07-31 04:18 GMT

Sri Prasanna Venkateswara Swamy: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

జూన్ 25 నుంచి జూలై 3 వరకు నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిత్యకైంకర్యాలు, ఉత్సవాల సందర్భంగా అర్చకులు, అధికారులు, పరిచారకులు, భక్తుల వల్ల తెలియక జరిగిన లోపాల పరిహారార్థం ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఈ పుష్పయాగాన్ని నిర్వహించారు.

స్నపన తిరుమంజనం, పుష్పాల శోభాయాత్ర

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్పయాగానికి వినియోగించే పుష్పాలను మూలమూర్తి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి, ఆలయ ప్రదక్షిణతో పాటు మాడవీధుల్లో శోభాయాత్రగా తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వభూపాల వాహనంలో స్వామివారిని కొలువుదీర్చారు.

రెండున్నర టన్నుల పుష్పాలతో దివ్య పుష్పార్చన

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సుమారు రెండున్నర టన్నుల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలతో సహా 18 రకాల పుష్పాలు, ఆరు రకాల పవిత్ర పత్రాలతో స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. ఆధ్యాత్మిక వైభవాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అనంతరం వీధి ఉత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఏఈవో శ్రీ దేవరాజులు, ఏవీఎస్వో శ్రీహరి రావు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, కంకణభట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News