Hayagriva Swamy: శ్రావణ మాస పౌర్ణమి కేవలం రాఖీ పండుగ మాత్రమే కాదు, జ్ఞానానికి, విద్యాబుద్ధులకు అధిపతి అయిన శ్రీ హయగ్రీవ స్వామి జయంతి కూడా. హిందూ సంప్రదాయంలో హయగ్రీవ స్వామిని వేదాల రక్షకుడిగా, జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. శ్రీమహావిష్ణువు గుర్రం ముఖం, మానవ శరీరంతో హయగ్రీవుడుగా ఎందుకు అవతరించాల్సి వచ్చిందో తెలిపే పౌరాణిక విశేషాలు ఇక్కడ చూద్దాం.

హయగ్రీవ అవతార ఆవిర్భావ కథ

పౌరాణిక గాథల ప్రకారం.. సృష్టి ఆరంభంలో మధు, కైటభులు అనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాచారు. వేదాలు లేకపోవడంతో సృష్టి కార్యాలు స్తంభించిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడి ప్రార్థనను మన్నించి శ్రీమహావిష్ణువు గుర్రం ముఖం, మానవ దేహంతో కూడిన దివ్య తేజోమయ రూపమైన హయగ్రీవుడుగా అవతరించారు. ఆ అవతారంలో శ్రీహరి సముద్ర గర్భంలోకి వెళ్లి ఆ రాక్షసులను సంహరించి, వేదాలను రక్షించి తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించారు. అందుకే హయగ్రీవ స్వామిని సకల వేదాలు, విద్యలు, శాస్త్రాలకు మూలపురుషుడిగా కొలుస్తారు.

హయగ్రీవ జయంతి ప్రాముఖ్యత - పూజా విధానం

విద్యాబుద్ధుల ప్రాప్తి:

హయగ్రీవ స్వామిని ఆరాధించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, వాక్చాతుర్యం పెరుగుతాయని విద్యార్థులు, పండితులు నమ్ముతారు.

నైవేద్యం - పూజ:

ఈ పర్వదినాన స్వామివారికి పాలు, తేనె, బెల్లం, శనగలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా యాలకులు, నెయ్యితో చేసిన పాయసం సమర్పించడం విశేష ఫలప్రదం.

హయగ్రీవ స్తోత్ర పఠనం:

"జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్..

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే.. అనే దివ్య మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుంది.

Tags: