Mouse Become Lord Ganesha’s Vehicle: గణేశుడికి ఎలుక వాహనంగా ఎలా మారిందనే దానిపై పురాణాల్లో కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకానొకప్పుడు క్రౌంచుడు అనే గంధర్వుడు ఉండేవాడు. ఒకసారి ఇంద్రుని సభలో అందరూ ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు, క్రౌంచుడు అప్సరసలతో సరదాగా ఉంటూ, సభకు అంతరాయం కలిగించాడు. దేవతలు, ఇంద్రుడు అతడిని వారించినా పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన ఇంద్రుడు అతడిని ఎలుకగా మారమని శపించాడు.

ఎలుకగా మారిన క్రౌంచుడు విపరీతమైన ఆకారంతో ఒక పర్వతంలా మారిపోయాడు. ఆ తర్వాత ఆశ్రమాల్లోని ధాన్యాలను, వస్తువులను నాశనం చేస్తూ అందరినీ భయపెట్టేవాడు. ఒకసారి అతను పరాశర మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడున్న వస్తువులన్నింటినీ ధ్వంసం చేశాడు. ఆ సమయంలో వినాయకుడు కూడా ఆ ఆశ్రమంలోనే ఉన్నారు. క్రౌంచుని ఆగడాలు చూసి వినాయకుడు తన పాశాన్ని (noose) ప్రయోగించి అతడిని పట్టుకున్నారు.

క్రౌంచుడు, తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడి, వినాయకుని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. దయార్ద్ర హృదయుడైన వినాయకుడు అతడిని క్షమించి, తన వాహనంగా ఉండమని కోరాడు. మొదట క్రౌంచుడు ఇంత పెద్ద వినాయకుని బరువును తాను మోయలేనని అన్నప్పటికీ, వినాయకుడు తన బరువును తగ్గించుకుని అతడిపై కూర్చున్నారు. అలా క్రౌంచుడు, గణేశుడికి వాహనంగా మారిపోయాడు. ఈ సంఘటన తర్వాతనే గణేశుడిని మూషికవాహనుడు అని పిలవడం మొదలైంది.

ఈ కథ వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, ఒక మనిషిలోని అహంకారం, కోరికలు, మరియు గందరగోళం (ఎలుక క్రమరహితమైన స్వభావాన్ని సూచిస్తుంది) వంటి వాటిని వినాయకుడు నియంత్రించగలడు అని చెప్పడం. తన వాహనంపై కూర్చుని ఉండటం ద్వారా, గణేశుడు మనలోని చెడు గుణాలను అదుపులో ఉంచుకోవాలని సందేశాన్ని ఇస్తున్నారు.

Tags: