Karvetinagaram: గోవింద నామస్మరణలతో మారుమోగిన కార్వేటినగరం
కార్వేటినగరం
Karvetinagaram: కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ యోగనారాయణుడి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, ధైర్యానికి, శీఘ్రగమనానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం వంటి అచంచలమైన భక్తిశ్రద్ధలను కలిగి ఉన్నప్పుడే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతాడని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాగే స్వామివారు రాక్షసుల హృదయాలలో సింహస్వరూపుడిగా ప్రత్యక్షమవుతారని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది. ఈ సందర్భంగా జరిగిన వాహనసేవలో సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించి పరవశించారు. మరోవైపు హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీ భూరం తిరుమల దీక్షిత్ అనే భక్తుడు సోమవారం టీటీడీ శ్రీ ఎస్వీ అన్నదానం ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు కి హైదరాబాద్ లోని కార్యాలయంలో విరాళం డీడీని దాత అందజేశారు. బెంగుళూరుకు చెందిన నిర్మాణ సంస్థ సముద్ర గ్రూప్ డైరెక్టర్ శ్రీ నవీన్ కుమార్ అనే భక్తుడు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11,11,111 లక్షలు విరాళంగా అందించారు.