Sri Govindaraja Swamy Temple: మే 18న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Update: 2026-05-16 10:15 GMT

Sri Govindaraja Swamy Temple: కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మే 23 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు.

ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించే ఈ విశిష్ట కార్యక్రమం వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితరాలను శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Tags:    

Similar News