Moustached Hanuman with Shani at His Feet: మీసాల హనుమంతుడు.. పాదల చెంత శని.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా..?

ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా..?

Update: 2026-04-27 12:43 GMT

Moustached Hanuman with Shani at His Feet: దేశంలో హనుమంతుని పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ గుజరాత్‌లోని సారంగ్‌పూర్‌లో వెలసిన కష్టభంజన్ దేవ్ ఆలయానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. పేరుకు తగ్గట్టే భక్తుల కష్టాలను తొలగించే దైవంగా ఇక్కడి స్వామి కొలవబడుతున్నాడు. శని దోషాలతో సతమతమయ్యే వారికి ఈ క్షేత్రం ఒక దివ్యౌషధం వంటిది.

మంత్రదండంతో ప్రాణం పోసుకున్న విగ్రహం

ఈ ఆలయ స్థాపన వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. సద్గురు గోపాలానంద స్వామి ఈ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పురాణాల ప్రకారం, ఆయన తన మంత్రదండంతో విగ్రహాన్ని తాకగానే, అందులోకి దైవశక్తి ప్రవేశించి ప్రాణం పోసుకుందని భక్తులు విశ్వసిస్తారు. 1899లో వడతల్‌కు చెందిన కోఠారి గోర్ధన్‌దాస్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా పునర్నిర్మించారు. ఈ ప్రాంగణంలోనే స్వామి నారాయణుని బోధనలను తెలిపే ప్రత్యేక ఆలయం కూడా ఉంది.

54 అడుగుల బృహత్ విగ్రహం.. వీరత్వానికి ప్రతీక

ఇటీవల ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన 54 అడుగుల భారీ హనుమంతుని విగ్రహం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. వేల కిలోల లోహంతో తయారైన ఈ విగ్రహం సుదూర ప్రాంతాల నుండి కూడా కనిపిస్తుంది. సాధారణంగా హనుమంతుని విగ్రహాలు సౌమ్యంగా ఉంటాయి, కానీ ఇక్కడ స్వామి శౌర్యానికి చిహ్నమైన మీసాలతో కనిపిస్తారు. బంగారు వస్త్రాలతో అలంకరించబడిన స్వామి చుట్టూ వానర సైన్యం కాపలాగా ఉన్నట్లు రూపొందించిన ఈ శిల్పకళా చాతుర్యం అద్భుతం.

హనుమ పాదాల చెంత శని దేవుడు.. ఎందుకంటే?

ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద విశిష్టత ఏమిటంటే.. ఇక్కడ శని దేవుడు హనుమంతుని పాదాల వద్ద కొలువై ఉండటం. తన భక్తులను ఇబ్బంది పెడుతున్న శని దేవుడిని హనుమంతుడు నిలదీయగా, వారిద్దరి మధ్య జరిగిన వాదనలో హనుమ విజయం సాధిస్తాడు. అప్పుడు శని దేవుడు తన తప్పు తెలుసుకుని, హనుమంతుని భక్తులను ఇకపై ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని ప్రతిజ్ఞ చేసి స్వామి పాదాలను ఆశ్రయించాడు. ఈ కారణంగానే శని దోషం, ఏలినాటి శనితో బాధపడేవారు ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటే గ్రహ పీడల నుండి విముక్తి లభిస్తుందని ప్రగాఢంగా నమ్ముతారు.

శనివారం జనసముద్రం

ప్రతి శనివారం సారంగ్‌పూర్ భక్తజనంతో కిటకిటలాడుతుంది. ఆ రోజున నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాలు మరియు హవనాలలో పాల్గొంటే మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, శారీరక రుగ్మతలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. లక్షలాది మంది జీవితాల్లో కొత్త ఆశలను నింపుతున్న ఈ క్షేత్రం, నేటికీ ఒక అజేయమైన దైవిక శక్తి కేంద్రంగా విరాజిల్లుతోంది.

Tags:    

Similar News