Saffron Flag Hoisted at Ayodhya Ram Mandir Peak: శ్రీరామ మందిర నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో ఆలయ శిఖరంపై 10 అడుగుల ఎత్తైన పవిత్ర కాషాయ జెండాను ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ చారిత్రక ధ్వజారోహణ కార్యక్రమం ఒక పవిత్రమైన రోజున జరగడం విశేషం. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం, వివాహ పంచమి రోజున ధ్వజారోహణ కార్యక్రమం జరగడం వెనుక బలమైన మతపరమైన కారణాలు ఉన్నాయి.

శ్రీ రామచంద్రుడు, సీతాదేవి వివాహం జరిగిన పవిత్ర దినాన్ని వివాహ పంచమిగా జరుపుకుంటారు. మార్గశిర మాసంలో ఐదవ రోజు వచ్చే ఈ రోజున, రామాలయంలో ధ్వజారోహణ చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు. దీనితో పాటు ఈ రోజు అయోధ్యలో 48 గంటలు నిరంతర తపస్సు చేసిన సిక్కు గురువు తేగ్ బహదూర్ త్యాగం చేసిన రోజు కావడం కూడా ఈ కార్యక్రమానికి ప్రాముఖ్యతను ఇస్తోంది.

ధ్వజారోహణకు శుభ ముహూర్తం

ఈ ధ్వజారోహణ కార్యక్రమం రాముడు జన్మించిన సమయంగా భావించే అభిజిత్ ముహూర్తం సందర్భంగా జరిగింది. ఈ రోజు ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:29 వరకు ఉన్న ఈ శుభ సమయాన్ని ఆలయ ధ్వజారోహణ కార్యక్రమానికి నిర్ణయించారు.

మంగళవారం ప్రత్యేకత

నవంబర్ 25, మంగళవారం రోజు ఈ ధ్వజారోహణ జరగడం కూడా అనేక విధాలుగా ప్రత్యేకంగా భావిస్తున్నారు:

శ్రీరాముని జననం: శ్రీరాముడు జన్మించిన రోజు మంగళవారం.

సీతారాముల కల్యాణం: త్రేతా యుగంలో, శ్రీరాముడు, సీత వివాహం చేసుకున్న శుభ తేదీ పంచమి, అది కూడా మంగళవారం కావడం కాకతాళీయం.

హనుమాన్ జయంతి: శ్రీరాముని గొప్ప భక్తుడు హనుమంతుడు మంగళవారం జన్మించాడని నమ్ముతారు.

ఈ కారణంగా మంగళవారం రామ భక్తులకు చాలా పవిత్రమైన, శక్తితో కూడిన రోజుగా పరిగణించబడుతుంది.

జెండా ప్రాముఖ్యత

రామమందిరంలో ఎగురవేయబడిన ఈ జెండా, శ్రీరామునిపై భక్తుల అచంచల విశ్వాసానికి చిహ్నంగా నిలుస్తుంది. ఇది సూర్యవంశం, రఘుకుల వంటి అయోధ్య గొప్ప సంప్రదాయాలకు సాక్ష్యంగా ఉండటమే కాకుండా, గౌరవం, ఐక్యత, సాంస్కృతిక కొనసాగింపు సందేశాన్ని కూడా తెలియజేస్తుంది.

Tags: