Sri Kalyana Venkateswara Swamy Rathotsavam: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం ఉదయం నిర్వహించిన రథోత్సవం భక్తి పారవశ్యంతో అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, భజనలు, వేదఘోషల మధ్య స్వామివారి రథయాత్ర సాగింది. ఉదయం 7.45 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు మహారథాన్ని అధిష్ఠించి నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజన బృందాల కీర్తనలు, నృత్యాలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి.

“గోవిందా… గోవిందా…” అనే భక్తినినాదాల మధ్య భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి కటాక్షాన్ని పొందారు. రథం యథాస్థానానికి చేరుకున్న అనంతరం వేదపారాయణం, దివ్యప్రబంధ పఠనం, శాత్తుమొర నిర్వహించి మహాహారతి సమర్పించారు.

రథోత్సవం ఆత్మానాత్మ వివేకానికి ప్రతీకగా నిలుస్తుంది. శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, ఆత్మ రథికుడనే ఉన్నత తాత్త్విక భావనను ఈ ఉత్సవం భక్తులకు బోధిస్తుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ నిర్వహించనున్నారు.

తొమ్మిదవ రోజు శుక్రవారం ఉదయం 7 గంటల నుండి పల్లకీ ఉత్సవం, ఉదయం 9.15 గంటల నుండి చక్రస్నానం, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెంగల్ రాయులు, శ్రీ నాగరాజు, అర్చకులు, పోలీసులు, విజిలెన్స్ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

Tags: