Sri Govindaraja Swamy Temple: శ్రీ గోవిందరాజస్వామి ఆలయ అనుబంధ వైభవంగా ప్రారంభమైన శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు
శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు
Sri Govindaraja Swamy Temple: తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీనారాయణస్వామి వారి ఆలయంలో శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు జూన్ 25వ తేదీ వరకు ఆలయంలో భక్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఉత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం వేళల్లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీ పెరియాళ్వార్ సన్నిధిలో దివ్యప్రబంధ పాశురాలను భక్తిపూర్వకంగా నివేదించారు. జీయర్ స్వాముల ఆధ్వర్యంలో సాగిన ఈ వేదమంత్రాల, పాశురాల పఠనం భక్తులలో ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లింది. నిత్యం భక్తులు విశేష సంఖ్యలో హాజరై ఈ దివ్య పారాయణాన్ని ఆలకిస్తున్నారు.
ఈ సందర్భంగా అర్చకులు శ్రీ పెరియాళ్వార్ విశిష్టతను వివరిస్తూ, ఆయన శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన మహాభాగవతుడని, భక్తి మార్గంలో అగ్రగణ్యుడని పేర్కొన్నారు. శ్రీ ఆండాళ్ అమ్మవారి తండ్రి అయిన శ్రీ పెరియాళ్వార్, స్వామివారి కైంకర్యం కోసం ప్రతిరోజూ స్వయంగా తులసీమాలలను తయారు చేసి సమర్పించేవారని తెలిపారు. ఆయన భక్తిభావంతో రచించిన పాశురాలు నేటికీ వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలిచాయని కొనియాడారు.
పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల ముగింపు రోజైన జూన్ 25న ఉదయం శ్రీ పెరియాళ్వార్కు విశేషంగా తిరుమంజనం (అభిషేకం) నిర్వహించనున్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం అత్యంత వైభవంగా స్వామివారి ఊరేగింపు జరగనుంది. ఈ క్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారు గరుడవాహనంపై, శ్రీ పెరియాళ్వార్ గజవాహనంపై అధిష్టించి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యమంగళ దర్శనం ప్రసాదించనున్నారు.
ఈ వైభవ మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ, ఇతర అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.