TTD EO Sri Muddada Ravichandra: శ్రీవారి సన్నిధిలో సేవ చేయడం పూర్వజన్మ సుకృతం
పూర్వజన్మ సుకృతం
TTD EO Sri Muddada Ravichandra: శ్రీవారి సన్నిధిలో భక్తులకు సేవ చేసే అదృష్టం లభించడం పూర్వజన్మ సుకృతమని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అన్నారు.
టీటీడీలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి శుక్రవారం పదవీ విరమణ చేసిన 28 మంది, అలాగే ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 31 వరకు పదవీ విరమణ పొందిన 132 మంది ఉద్యోగులు కలిపి మొత్తం 160 మందికి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, భక్తుల సేవలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అంకితభావంతో పనిచేసిన ఉద్యోగుల సేవలు టీటీడీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో సంపాదించిన అనుభవాన్ని, విలువైన జ్ఞానాన్ని భావితర ఉద్యోగులతో పంచుకుని వారికి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.
ఉద్యోగ విరమణ అనంతరం అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని, శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గౌరవించే ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కొనసాగిస్తామని తెలిపారు.
అంతకుముందు టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ, శ్రీవారి సేవ చేసే అవకాశం దక్కడం మహాభాగ్యమని, పదవీ విరమణ ఉద్యోగులను ఘనంగా సత్కరించడం భావితర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
అనంతరం ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జేఈవోలు కలిసి పదవీ విరమణ పొందిన టీటీడీ శ్రీ సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి సహా వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు శ్రీవారి లడ్డు ప్రసాదం, వడ, జాకెట్ పీస్, తీర్థం, మహా ప్రసాదం అందించి, శ్రీవారి శాలువాతో సత్కరించారు.