Himayatnagar TTD Temple: హిమాయత్నగర్ టీటీడీ ఆలయంలో వైభవంగా వసంతోత్సవాలు
వైభవంగా వసంతోత్సవాలు
Himayatnagar TTD Temple: హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక శోభ విల్లిరిసింది. హిమాయత్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వసంతోత్సవాలు భక్తుల కోలాహలం నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు స్వామివారి రథోత్సవాన్ని ఆలయ అధికారులు కన్నులపండువగా నిర్వహించారు.
విశేష పూజల అనంతరం.. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి ఆలయ ప్రాంగణంలో శోభాయాత్రగా తీసుకెళ్లారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ పల్లకి ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రథోత్సవం సాగుతుండగా మహిళా భక్తులు కోలాటాలు ఆడగా, యువకులు భజనలు నిర్వహించారు. చిన్నారులు భక్తి గీతాలకు చేసిన నృత్యాలు ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చాయి.
ఈ వసంతోత్సవాల సందర్భంగా ఆలయంలో స్వాతి సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, స్నపన తిరుమంజనం వంటి ప్రత్యేక పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పసుపు, గంధం, కస్తూరి తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం ఆ పవిత్ర తీర్థ జలాన్ని భక్తులపై ప్రోక్షించారు.
కలియుగ వైకుంఠనాథుడి రథోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు అన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి నామస్మరణతో హిమాయత్నగర్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి.