The Mythological Story Behind Atla Taddi: అట్ల తద్ది వెనుక ఓ పౌరాణిక గాథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఓ రాజకుమార్తె తన స్నేహితురాళ్లతో కలిసి చంద్రోదయ ఉమా వ్రతాన్ని ఆచరించింది. వ్రత నియమం ప్రకారం.. చంద్రోదయం అయిన తర్వాతే ఉపవాసం విరమించాలి. అయితే రాజకుమార్తె సోదరుడు ఆమెపై ఉన్న ప్రేమతో, ఇంద్రజాలం చేసి అద్దంలో తెల్లటి వస్తువును చూపించి, చంద్రుడు వచ్చాడని నమ్మబలికాడు. రాకుమార్తె తన సోదరుడి మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.

చంద్రుడు రాకముందే భోజనం చేయడంతో వ్రతభంగమై ఆమెకు వృద్ధుడైన భర్త లభించాడు. తన స్నేహితురాళ్లకి యవ్వనవంతులైన భర్తలు లభించారు. అది చూసి ఆమె బాధపడింది. పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించింది. వారు వ్రతభంగానికి కారణం చెప్పి, తిరిగి నియమనిష్టలతో వ్రతం చేయమని చెప్పారు. ఆమె ఈసారి నియమాలు పాటిస్తూ వ్రతం చేయగా వృద్ధుడైన భర్త యవ్వనవంతుడయ్యాడు. అందుకే కోరిన వరుడిని పొందడానికి అమ్మాయిలు ఈ వ్రతం చేయాలని చెబుతారు.

ఈ వ్రత మహిమ వల్ల పార్వతీ దేవికి పరమేశ్వరుడు భర్తగా లభించారు. అందుకే, కన్యలు కోరిన భర్త లభించాలని, వివాహిత స్త్రీలు తమ భర్త క్షేమం, ఆయురారోగ్యాలు, మరియు అన్యోన్య దాంపత్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ కథ ద్వారా వ్రతంలో నియమనిష్ఠలు ఎంత ముఖ్యమో, అలాగే చంద్రుడి దర్శనం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది. అందుకే దీనిని 'చంద్రోదయ ఉమా వ్రతం' అని కూడా పిలుస్తారు.

Tags: