Feeling Gassy After Eating Pulses: మన భారతీయ భోజనంలో పప్పు ధాన్యాలకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ప్రోటీన్లకు నిలయమైన ఈ పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, చాలామంది పప్పు తినాలంటేనే భయపడుతుంటారు. దానికి కారణం.. అజీర్తి, గ్యాస్ సమస్యలు. పప్పు తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం చాలామంది ఎదుర్కొనే కామన్ ప్రాబ్లం.

పప్పులను వండే ముందు వాటిని సరైన పద్ధతిలో నానబెట్టడం ద్వారా ఈ గ్యాస్ సమస్యను సమూలంగా అరికట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పప్పు ధాన్యాలలో ఉండే 'ఫైటిక్ యాసిడ్' గ్యాస్‌ను కలిగించే కొన్ని రకాల చక్కెరలను (Complex Sugars) తొలగించాలంటే నానబెట్టడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల పప్పులోని పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందుతాయి. జీర్ణక్రియ కూడా ఎంతో సులభమవుతుంది.

మరి ఏ పప్పును ఎంతసేపు నానబెట్టాలంటే మీరు వండేది పొట్టు తీసిన పప్పులు (ఉదాహరణకు పెసరపప్పు, ఎర్రపప్పు) అయితే.. వాటిని కనీసం 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టాలి. అదే పొట్టు తీయని పప్పులు లేదా మామూలు పప్పులు అయితే 7 నుంచి 8 గంటల పాటు నానబెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇక రాజ్మా, చోలే లేదా శనగలు వంటి గట్టి ధాన్యాల విషయానికొస్తే.. వీటికి మరింత సమయం పడుతుంది. వీటిని కనీసం 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్‌ను కలిగించే మూలకాలు నీటిలోకి విడుదలవుతాయి. ఆ తర్వాత ఆ నీటిని పారబోసి, మంచి నీటితో కడిగి వండుకుంటే గ్యాస్ ముప్పు ఉండదు.

Tags: