విశాఖకు మణిహారంగా గ్రీన్ ఫీల్డ్ రింగ్ రోడ్

రాంబిల్లి నుంచి భోగాపురం వరకూ ఆరు లైన్ల రహదారి;

Update: 2025-05-22 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే విశాఖపట్టణాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదుద్దుతామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే విశాఖపట్టణలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. విశాఖకు ఒకవైపు సముద్రం ఉంటుంది కాబట్టి... నెలవంక రూపంలో రాంబిల్లి నుంచి భోగా పురం వరకు ఈ సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దాదాపు 85 కిలో మీటర్లు ఉండే ఈ రహాదారిని సిక్స్ లేన్ రహదారిగా నిర్మించనుంది. ఈ సెమీ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను వీఎంఆర్డీఏ ప్రిపేర్ చేస్తోంది. విశాఖలో రవాణా, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటు, గృహ నిర్మాణం రంగాలలో అనేక అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ క్రమంలోనే విశాఖ నగరానికి నక్లెస్ తొడిగినట్లు ఉండేలా రాంబిల్లి నుంచి భోగాపురం వరకూ సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ధయం తీసుకుంది.

ఇదే విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు తరహాలో విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. అలాగే విశాఖపట్నం మెట్రో నిర్మాణ పనులను అక్టోబర్ నెల నుంచి మొదలు పెట్టనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. విశాఖ మెట్రోకి సంబంధించి డబుల్ డెక్కర్ మెట్రో కింద కేంద్రానికి డీపీఆర్ ఇచ్చినట్లు వివరించారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని నారాయణ తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా 22 రోడ్లు ప్రతిపాదించామని.. అందులో 15 రోడ్లు పూర్తి అవుతున్నాయన్నారు. 115 రోజుల్లో మిగిలిన రోడ్లను పూర్తిచేస్తామని వెల్లడించారు.మరోవైపు ఏపీ రాజధాని అమరావతిలో రింగ్ రోడ్డు నిర్మాణం తలపెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి రింగ్ రోడ్డు తరహాలో విశాఖలోనూ రింగ్ రోడ్డు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

అయితే సముద్రం, కొండలు అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మరోవైపు విశాఖ మధ్య నుంచి నేషనల్ హైవే వెళ్తోంది. అలాగే విశాఖపట్నం నుంచి భోగాపురం వరకూ కేంద్రం కోస్టల్ కారిడార్ ప్రతిపాదన చేసింది. దీంతో సగం రింగ్ రోడ్డు ప్లానింగ్ జరిగినట్టేనని అధికారులు చెప్తున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి నుంచి తాళ్లపాలెం, అనకాపల్లి, కొత్తవలస మీదుగా విజయనగరం నుంచి భోగాపురాన్ని కలుపుతూ మిగతా సగం రింగ్ రోడ్డు నిర్మించాలని వీఎంఆర్డీఏ అధికారులు భావిస్తున్నారుఅనకాపల్లి, విశాఖపట్నంలతో కలవకుండా వాటి పై నుంచి విజయనగరం మీదుగా భోగాపురం వరకు అర్ధ చంద్రాకారంలో ఈ రింగ్ రోడ్డు నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. ఆరు వరుసలుగా మొత్తం 85 కిలోమీటర్ల మేరకు ఈ సెమీ రింగ్ రోడ్డు నిర్మించాలని వీఎంఆర్డీఏ భావిస్తోంది. అనకాపల్లి-పెందుర్తి-ఆనందపురం మీదుగా భోగాపురం ఎయిర్పోర్టు వరకూ ఈ సెమీ రింగ్ రోడ్డు వస్తుందని వీఎంఆర్డీఏ అధికారుుల చెప్తున్నారు. సెమీ రింగ్ రోడ్డు నిర్మా్ణానికి అవసరమైన అలైన్మెంట్తో పాటుగా రింగ్ రోడ్డు పొడవు, వెడల్పు, నిర్మాణానికి అవసరమైన భూములు, వంతెనలు వంటి అంశాలపై అధ్యయనం చేసి రిపోర్టు తయారు చేయడానికి వీఎంఆర్డీఏ ఇప్పటికే కన్సల్టెంట్లను ఆహ్వానించింది.

Tags:    

Similar News