మరణించిన ఉగ్రవాదులకు కొలంబియా ప్రభుత్వం సంతాపం
అసంతృప్తి వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్;
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, మరణించిన ఉగ్రవాదులపట్ల కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. భారత పార్లమెంట్ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా థరూర్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొలంబియా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరుల పట్ల కనీస సానుభూతి వ్యక్తం చేయకపోగా.. భారత్ దాడుల తర్వాత పాక్లో చనిపోయినవారికి మాత్రమే సంతాపం తెలిపిన కొలంబియా ప్రభుత్వ వైఖరి తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్కు దారితీసిన పరిస్థితులు, భారత్ తీసుకున్న చర్యలను కొలంబియా అధికారులకు వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శశిథరూర్ స్పష్టం చేశారు.దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్ అనేక దాడులను భరించిందని ఈ సందర్భంగా శశిథరూర్ గుర్తు చేశారు. పాక్ తన సైనిక పరికరాలను రక్షణ కోసం కాకుండా.. పక్క దేశాలపై దాడి చేసేందుకు వినియోగిస్తోందని మండిపడ్డారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాత్రమే భారత్ విధానాలు ఉంటాయని ఈ సందర్భంగా శశిథరూర్ స్పష్టం చేశారు. పహల్గాం దాడి వెనక పాక్ ప్రాయోజిత ఉగ్రవాదం ఉందనడానికి భారత్ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని వెల్లడించారు. పాక్లో వినియోగంలో ఉన్న రక్షణ పరికరాల్లో దాదాపు 81శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవేనని తెలిపారు. ఇదే విషయాన్ని తాము అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రస్తావించనున్నట్లు థరూర్ వెల్లడించారు.