రోజూ తెలుగు సినిమాలు, సీరియళ్లు చూస్తా - మిస్ జాంబియా
తాను రోజూ తన కుటుంబ సభ్యులతో కలిసి తెలుగు సినిమాలు, సీరియళ్లు చూస్తానని మిస్ జాంబియా ఫెయిత్ భ్వాల్యా చెప్పింది. జాంబియాలో భారతీయ సినిమా, ముఖ్యంగా టాలీవుడ్ అంటే పాపులర్ అని తెలిపింది. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తెలుగు సీరియళ్లు చూడటం ఒక సామూహిక వినోదమని అభిప్రాయపడింది.
భారత్లో ఇది తన మొదటి పర్యటన అని చెప్పిన మిస్ జాంబియా ఫెయిత్ భ్వాల్యా తన అనుభూతులను పొలిటెంట మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను భారత్లో గడిపిన సమయం అత్యంత విలువైనదని, ప్రత్యేక మైనదని చెప్పింది. బిర్యానీ, కబాబ్స్ వంటి వంటకాలను ఆస్వాదించానని, కొత్త రుచులు ట్రై చేయడం సంతోషంగా అనిపించిందని తెలిపింది. భారత్ నుంచి తాను తిరిగి వెళ్లేటప్పుడు ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్న వస్తువుల్లో పెర్ఫ్యూమ్స్, చీరలు ఉంటాయంది. అలాగే, తన కుటుంబ సభ్యులు, జాంబియాలో ఉన్న వాళ్లు ప్రత్యేకంగా తనను హెయిర్ విగ్స్ తీసుకు రమ్మన్నట్లు ఫెయిత్ వెల్లడించింది.
భారతీయ సంస్కృతి అందం, వైవిధ్యం గురించి ప్రశంసిస్తూ.. ఇంత వైవిధ్యభరితమైన, సంపన్నమైన సంస్కృతిని చూడడం సంతోషంగా ఉందని చెప్పింది. భారతీయ దుస్తులు, ఆభరణాల పట్ల ఆసక్తిని వ్యక్తం చేసింది. ప్రత్యేకించి చీరలు, ముత్యాల గురించి ప్రస్తావించింది. వాటిని ధరించడం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. తనకు ఇష్టమైన తెలుగు స్టార్లు అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ అని చెబుతూ.. ప్రియాంకా చోప్రా వంటి భారతీయ స్టార్లను కలవాలన్న ఆశను కూడా వ్యక్తం చేసింది.