Immigrants in the US in Panic: అమెరికాలో ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో సాధారణంగా ఎయిర్‌పోర్టులు, రోడ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి. చాలా మంది కుటుంబ సమేతంగా పర్యటనలు చేస్తారు. కానీ ట్రంప్ ప్రభుత్వం వీసా, ఇమిగ్రేషన్ నియమాలను కఠినతరం చేసిన నేపథ్యంలో వలసదారులు మాత్రం భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేయడం కూడా మానేస్తున్నారు. విదేశీ పర్యటనలైతే పూర్తిగా రద్దు చేసుకుంటున్నారు.

న్యూయార్క్ టైమ్స్, కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలో నివసిస్తున్న విదేశీ వలసదారుల్లో ప్రతి 10 మందిలో ముగ్గురు ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిని ఆకర్షించకూడదనే ఉద్దేశంతో ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నట్లు తేలింది. ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారుల్లో 32 శాతం, అమెరికా పౌరత్వం పొందిన విదేశీయుల్లో 15 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అక్రమంగా లేదా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారుల్లో ఈ భయం మరీ ఎక్కువ. వారిలో 63 శాతం మంది ఇంటికే పరిమితమై బయటకు రావడం మానేశారు. భారతీయులతో సహా అనేక దేశాల వలసదారులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీతో పాటు ఇతర వీసాల నిబంధనలను గట్టిగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తప్ప విదేశీ ప్రయాణాలు చేయొద్దని పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు సూచించాయి. ఫలితంగా వలసదారులు ఇళ్లకే పరిమితమవుతూ, సెలవుల సీజన్‌ను కూడా ఇంటి వద్దే గడుపుతున్నారు.

Tags: