Lawrence Bishnoi Gang: కెనడాలో భారతీయ వ్యాపారవేత్తపై బుల్లెట్ల వర్షం: తామే ఈ హత్యకు కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్
తామే ఈ హత్యకు కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్ట్
Lawrence Bishnoi Gang: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలోని అబోట్స్ఫోర్డ్లో భారత సంతతికి చెందిన 68 ఏళ్ల వ్యాపారవేత్త దర్శన్ సింగ్ సాహ్సీపై మంగళవారం ఉదయం కారులోనే బుల్లెట్ల వర్షం కురిపించి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఈ హత్య జైలులో ఉన్న అండర్వరల్డ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేసినట్లు ప్రకటించడం విశేషం.
వీడియో దృశ్యాల ప్రకారం, తన కారులో కూర్చుని ఉన్న దర్శన్ సింగ్ సాహ్సీపై ఓ దుండగుడు ఆకస్మికంగా కారు దగ్గరకు వచ్చి అనేక కాల్పులు జరిపాడు. కాల్పులు పూర్తయిన తర్వాత ఆ దుండగుడు స్థలం నుంచి త్వరగా పారిపోయాడు. పంజాబ్లోని లూధియానాకు చెందిన దర్శన్ సింగ్, 'కానమ్ ఇంటర్నేషనల్' అనే దుస్తుల రీసైక్లింగ్ కంపెనీకి అధ్యక్షుడు. ఈ ఘటన ఆయన కారు సమీపంలోనే జరిగింది.
పోలీసుల ప్రకారం, ఈ దాడి కావాలనే టార్గెటెడ్ దాడిగానే జరిగింది. కాల్పులు చేసిన వ్యక్తి ముందే స్థలంలో కారును పార్క్ చేసి ఉంచి, దర్శన్ కారు ఎక్కగానే దాడి చేసి పారిపోయాడు. ఈ హత్య జరిగిన వెంటనే, లారెన్స్ బిష్ణోయ్కు సన్నిహితుడైన గోల్డీ ధిల్లాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తామే ఈ హత్యకు కారణమని ప్రకటించాడు. "మా గ్యాంగ్ డిమాండ్ చేసిన దోపిడీ డబ్బు (ఎక్స్టార్షన్ మనీ) ఇవ్వడానికి దర్శన్ సింగ్ నిరాకరించాడు. మా నంబర్లను కూడా బ్లాక్ చేశాడు. అంతేకాకుండా, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా పాల్గొన్నాడు. డబ్బు ఇవ్వనందుకే ఈ శిక్ష" అంటూ ధిల్లాన్ ఆరోపణలు చేశాడు.
అయితే, ఈ ఆరోపణలపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దర్శన్ సింగ్ మాదకద్రవ్యాల వ్యాపారంలో ఉన్నాడనే ఆరోపణలు నిజమా అనేది దర్యాప్తులో తేలనుంది. కెనడా ప్రభుత్వం లారెన్స్ బిష్ణోయ్ సిండికేట్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి, వారి ఆస్తులను జప్తు చేసుకోవడానికి, కార్యకలాపాలను అరికట్టడానికి పూర్తి అధికారాలు ఇచ్చిన కొద్ది వారాలకే ఈ దారుణ ఘటన జరగడం ఆందోళనకరం.
అబోట్స్ఫోర్డ్ పోలీసులు వీడియో సాక్ష్యాలను, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ, ఈ హత్యలో ఏమైనా క్రాస్-బోర్డర్ లింక్లు ఉన్నాయా అని ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. భారత్కు చెందిన దర్శన్ సింగ్ సాహ్సీ కుటుంబం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, పోలీసులు త్వరగా నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేసింది. ఈ హత్య భారతీయ కమ్యూనిటీలో భయాన్ని కలిగించింది.