ఇరాన్లో భయం భయంగా భారతీయ విద్యార్థులు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతోన్న యుద్ధం అక్కడ చదువుతోన్న భారతీయ విద్యార్థులకు నరకంగా మారింది. తమను స్వదేశానికి పంపించాలంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. ఈ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్న దాడులు, భీతావహ దృశ్యాలు చూడలేకపోతున్నామని, ఇలాగే ఉంటే తమ ప్రాణాలకు కూడా ముప్పు తప్పదని ఇరాన్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
యుద్ధం కారణంగా ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగ బడుతోంది. దీంతో, ఎక్కడ చూసినా పేలుడు శబ్దాలు, సైరన్ల మోతలతో ఇరాన్ దద్దరిల్లుతోంది. ఉన్నత చదువుల కోసం ఇరాన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులు ఈ పరిస్థితులతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. రాత్రిళ్లు మిస్సైళ్ల శబ్దాలతో నిద్ర కూడా పోలేక పోతున్నామని, వీలైనంత తొందరగా తమను భారత్కు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎప్పుడు ఎక్కడ పేలుడు సంభవిస్తుందో, ఏ శకలం ఎటువైపు నుంచి దూసుకొస్తుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని భారతీయ విద్యార్థులు చెబుతున్నారు. టెహ్రాన్లోని ఒక్క షాహిద్ యూనివర్సిటీలోనే దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది కాకుండా మరిన్ని యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య వేలల్లోనే ఉంటుందంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు భయం భయంగా గడుపుతున్నారు. నిత్యం కాల్పుల శబ్దాలు, పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, తాగునీరు కూడా భద్ర పరుచుకోవాలంటూ అధికారులు సూచనలు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు.
అయితే, ఈ పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ రియాక్ట్ అయ్యింది. ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులను నిరంతరం టెహ్రాన్లోని భారతీయ ఎంబసీ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, మన దేశానికి చెందిన విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలువురు భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని విదేశాంగ శాఖ ప్రకటించింది. మిగతా విద్యార్థుల పరిస్థితిని కూడా టెహ్రాన్లోని భారతీయ ఎంబసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారని, క్కడి కమ్యూనిటీ నాయకులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించింది.
ఈ క్రమంలోనే విద్యార్థుల తరలింపునకు సంబంధించి భారత్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ అంగీకరించిందని, అయితే, ఇప్పుడు ఇరాన్ గగనతలం మూసేసిన కారణంగా భూ సరిహద్దుల మీదుగా విద్యార్థులను తీసుకెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది.