Iran Heavy Water Facility Destroyed: ఇరాన్ భారజల కేంద్రం ధ్వంసం – ఉత్పత్తి నిలిచిపోయిందని IAEA వెల్లడి
ఉత్పత్తి నిలిచిపోయిందని IAEA వెల్లడి
Iran Heavy Water Facility Destroyed: ఇరాన్లోని ప్రధాన అణు సంబంధిత స్థావరాలపై ఇటీవల జరిగిన దాడుల్లో ఒకటైన అరాక్లోని భారజల రియాక్టర్ తీవ్రంగా ధ్వంసమైందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) స్పష్టం చేసింది. ఈ దాడిలో భారజల ఉత్పత్తి కేంద్రం పూర్తిగా నాశనమై, ప్రస్తుతం అక్కడ ఏ విధమైన ఉత్పత్తి జరగడం లేదని IAEA తాజా నివేదికలో వెల్లడించింది. అయితే, ఆ స్థావరంలో అణుధార్మిక పదార్థాలు ఉన్నట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదని కూడా ఏజెన్సీ పేర్కొంది.
మార్చి 27న జరిగిన ఈ దాడులను ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించింది. దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని, రేడియేషన్ వ్యాప్తి ముప్పు కూడా లేదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడులకు తామే బాధ్యులమని ఇజ్రాయెల్ మిలిటరీ కూడా బహిరంగంగా ప్రకటించింది.
అదే సమయంలో ఉత్తర ఇరాన్లోని తబ్రిక్లోని పెట్రో కెమికల్ కర్మాగారంపై కూడా దాడి జరిగింది. చమురు, గ్యాస్, ప్లాస్టిక్లతో సహా వివిధ రసాయన ఉత్పత్తులు తయారు చేసే ఈ ప్లాంట్ కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
వాళ్లే మా టార్గెట్.. తీవ్ర ప్రతీకారం!
ఈ దాడులకు గట్టి ప్రతీకారం తీసుకుంటామని ఇరాన్ మరోసారి హెచ్చరికలు విసరింది. పశ్చిమాసియాలోని అమెరికా-ఇజ్రాయెల్ కమాండర్లు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పష్టం చేసింది. ‘‘వేల కిలోమీటర్ల దూరం నుంచి అమెరికా మాపై బెదిరింపులకు పాల్పడుతోంది. వాటిని మేం గట్టిగా ఎదుర్కొంటాం. బెదిరింపులు కొనసాగితే వారి కమాండర్లు, సైనికులు పర్షియన్ గల్ఫ్లోని షార్కులకు ఆహారమవుతారు’’ అని IRGC అధికార ప్రతినిధి హెచ్చరించారు.
ఈ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా అణు ఉద్రిక్తతలను మరింత పెంచినట్లు తెలుస్తోంది.1sExpert