Israel: ఇజ్రాయెల్: ఇరాన్ ఉన్నతాధికారుల హత్య కుట్ర వార్తలు కల్పితం
వార్తలు కల్పితం
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తీవ్రంగా ఖండించింది.
Israel: పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధులపై ఇజ్రాయెల్ హత్యాయత్నాలు చేసే అవకాశం ఉందని అమెరికా మీడియా వార్తలు ప్రచురించాయి. ఈ వార్తలను ఇజ్రాయెల్ పూర్తిగా కల్పితమని, నకిలీ అని ఖండించింది.
ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ‘‘అమెరికా మీడియా ఎప్పటిలాగే వాస్తవాలను విస్మరించి కల్పిత కథనాలు రాసింది. ఇది వాస్తవాలకు దూరమైన ఫాబ్రికేషన్’’ అని తీవ్రంగా విమర్శించింది.
అమెరికా మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ ఘాలిబఫ్లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారని వెల్లడైంది. దీని నేపథ్యంలో గల్ఫ్ దేశాలను ఇరాన్ను అప్రమత్తం చేయాలని అమెరికా కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి హత్యాయత్నం జరిగితే శాంతి చర్చలు పూర్తిగా విఫలమై, మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని అమెరికా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ ప్రతినిధులు ఇటీవల దోహాలో రెండు రోజుల పాటు పరోక్ష చర్చలు జరిపారు. హర్మూజ్ జలసంధిలో సముద్ర రవాణా భద్రత, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. తదుపరి చర్చలు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జరగనున్నాయి. ఈ చర్చలు సానుకూలంగా ఉన్నాయని, యుద్ధ విరమణ ఒప్పందం అమలులో కొంత పురోగతి సాధించినట్లు ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఇజ్రాయెల్ ఈ వార్తలను పూర్తిగా ఖండించడంతో ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి ప్రయత్నాలపై మరింత దృష్టి పడుతోంది.