Masood Azhar's Family: ఆపరేషన్ సిందూర్ వల్ల మసూద్ అజార్ కుటుంబం లో విచ్ఛిన్నం: జైషే కమాండర్
మసూద్ అజార్ కుటుంబం లో విచ్ఛిన్నం: జైషే కమాండర్
Masood Azhar's Family: జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయారని జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ధృవీకరించారు.
ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఇలియాస్, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తాము దిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడామని, ఈ ప్రక్రియలో అనేక త్యాగాలు చేశామని తెలిపారు. మే 7న భారత సైన్యం బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిందని, ఈ దాడిలో మసూద్ అజార్ కుటుంబం ఛిన్నాభిన్నమైందని ఆయన వెల్లడించారు. భారత సైన్యం తమ రహస్య స్థావరాల్లోకి చొచ్చుకుని దాడులు ఎలా చేసిందనే వివరాలను ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడిలో 26 మంది పౌరులు మరణించారు. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను నాశనం చేసింది. బహవల్పూర్లోని మర్కజ్ సబాన్, జైషే మహ్మద్ ఆపరేషనల్ హెడ్క్వార్టర్గా పనిచేస్తూ, మసూద్ అజార్ నివాసంగా ఉపయోగించే భవనంపై కూడా దాడి జరిగింది. ఈ దాడుల్లో మసూద్ కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు.