Strait of Hormuz Dispute: హోర్ముజ్ జలసంధి వివాదం: ఆర్టికల్-5 కీలకం.. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి
ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి
Strait of Hormuz Dispute: హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందంలోని ఆర్టికల్-5 అమలు విషయంలో భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఉద్రిక్తతలను తగ్గించి చర్చలకు మార్గం సుగమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంక్షల ఉపశమనం, అణు కార్యక్రమం వంటి కీలక అంశాలపై ముందుకు వెళ్లాలని కూడా ఈ ఒప్పందం ప్రకారం నిర్ణయించారు. అయితే, ఒప్పందం అమలులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై దాడి జరిగినట్లు స్థానిక మీడియా వార్తలు వెలువడ్డాయి. దీనికి ప్రతిగా అమెరికా చర్యలు తీసుకోవడంతో ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఆర్టికల్-5 ఉల్లంఘన ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఆర్టికల్-5లో ఏముంది?
ఆర్టికల్-5 ప్రకారం హోర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకలు సురక్షితంగా, తాత్కాలికంగా 60 రోజుల పాటు ఎలాంటి రుసుములు లేకుండా ప్రయాణించేందుకు ఇరాన్ చర్యలు తీసుకోవాలి. అలాగే 30 రోజుల్లో సాంకేతిక అడ్డంకులు, సైనిక మైన్లను తొలగించాలని సూచించింది. దీంతోపాటు ఒమన్తో చర్చలు జరిపి భవిష్యత్తులో సముద్ర మార్గ నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందం పేర్కొంది.
అమెరికా, యూఏఈలు హోర్ముజ్ను అంతర్జాతీయ వాణిజ్య మార్గంగా స్వేచ్ఛగా ఉంచాలని కోరుతున్నాయి. కానీ ఇరాన్ మాత్రం భద్రతా ఏర్పాట్లు తాత్కాలికంగా తన నియంత్రణలోనే ఉంచాలని వాదిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా ఈ వాదనను సమర్థించారు. అమెరికా దీనికి వ్యతిరేకంగా స్పందిస్తోంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఒప్పంద నిబంధనలను అమెరికా కొత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఇరాన్ తన నియంత్రణను కొనసాగించాలని పట్టుబట్టుతోంది. ఈ విభేదాలే తాజా ఉద్రిక్తతలకు కారణమని వారు చెబుతున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో సింహభాగం హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా జరుగుతున్నందున, ఇక్కడి ఏ చిన్న ఉద్రిక్తత అయినా అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.