Trump Orders Resumption of Nuclear Tests: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అణువాయుధ పరీక్షలను మళ్లీ ప్రారంభించాలని యుద్ధశాఖకు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్) ఆదేశాలు జారీ చేశారు. రష్యా, చైనా వంటి దేశాలు తమ అణుసామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్న ఈ సమయంలో ట్రంప్ ఈ చర్యకు దిగడం రాజకీయ, కస్టమ్‌లో కీలక మలుపుగా మారింది.

ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన ట్రంప్ ప్రకటనలో, "ప్రపంచ దేశాలలో అమెరికాకు ఎక్కువ అణువాయుధాలు ఉన్నాయి. నా మొదటి పదవీకాలంలోనే ఈ స్థితిని సాధించాం. దాని విధ్వంసకర శక్తి కారణంగా దీన్ని వాడకానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు మరో మార్గం లేదు. రష్యా అణుకార్యక్రమాల్లో రెండో స్థానంలో, చైనా మూడో స్థానంలో ఉంది. ఐదేళ్లలోపు అవి మాకు సమాన స్థాయికి చేరుకుంటాయి. ఇతర దేశాలు తమ కార్యక్రమాలను విస్తరిస్తున్నందున, మన అణుపరీక్షలను పునఃప్రారంభించాలని యుద్ధశాఖకు ఆదేశించాను. ఈ ప్రక్రియ వెంటనే మొదలవుతుంది" అంటూ వివరించారు.

రష్యా తన ఆయుధ ఉత్పాదనను భారీగా పెంచుకుంటోంది. ఇటీవల కీలక అణుఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి ఉపసంహరించుకుని, అధునాతన అణు సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది. 'పోసిడాన్' అనే అణుశక్తి ఆధారిత సముద్ర తలపై డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ప్రకటించారు. అదే సమయంలో చైనా కూడా తన అణు సంపదను విస్తరిస్తోంది. మరో ఐదేళ్లలో చైనా అణుసామర్థ్యాలు అమెరికా, రష్యాకు సమానంగా మారతాయని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీకి కొన్ని గంటల ముందే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే, పెంటగాన్ అధికారికంగా ఈ ఆదేశాలపై ఇంకా స్పందన ఇవ్వలేదు.

Tags: