Keir Starmer: వచ్చే ఏడాది నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా పూర్తి నిషేధం: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటన
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటన
Keir Starmer: సోషల్ మీడియా వ్యసనం మరియు దాని దుష్ప్రభావాల నుంచి చిన్నారులను రక్షించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది (2027) నుంచి యూకేలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వినియోగించకుండా పూర్తి నిషేధం విధించనుంది.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ మేరకు తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి సంబంధిత చట్టాన్ని రూపొందించి, వచ్చే ఏడాది మార్చి నాటికి అమలు చేస్తామని తెలిపారు. ఆన్లైన్ ప్రపంచంలోని చెడు ప్రభావాల నుంచి పిల్లలను కాపాడటం ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని అన్నారు.
"పూర్తిస్థాయి నిషేధమే సరైన మార్గం అని నాకు అనిపిస్తోంది. దీని అమలు సవాలుతో కూడుకున్నదే కానీ, టెక్ కంపెనీల ఒత్తిడిని ఎదుర్కొని ప్రభుత్వాలు బాధ్యత వహించాలి" అని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. పిల్లల భద్రత, ఆనందం విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని, కుటుంబాల పక్షాన నిలబడాల్సిన సమయం ఇదేనని అన్నారు.
ఇతర దేశాల్లోని పరిస్థితి:
ఆస్ట్రేలియా: ఇప్పటికే ఇలాంటి నిషేధం అమలులో ఉంది.
ఇండోనేషియా: సోషల్ మీడియాపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది.
బ్రెజిల్: పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఇప్పటికే పలు ఆంక్షలు ఉన్నాయి.
ఫ్రాన్స్: నిషేధం విధించేందుకు సన్నాహాలు చేస్తోంది.
తుర్కియే: చర్యలు తుదిదశలో ఉన్నాయి.
బ్రిటన్ తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని, ఈ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తామని ప్రధాని కీర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు.