Ukraine Launches First Robot-Only Attack on Battlefield: యుద్ధరంగంలో తన సైనికుల ప్రాణాలను కాపాడుకోవడానికి ఉక్రెయిన్ కొత్త వ్యూహం అవలంబిస్తోంది. మానవ సైనికుల స్థానంలో రోబో సైనికులను యుద్ధభూమికి దింపి, వారి ప్రాణాలను రక్షిస్తోంది. ఈ రోబోలను నియంత్రించే ఆపరేటర్లు యుద్ధరంగం సమీపంలో ఉండకుండా, సురక్షిత ప్రదేశాల నుంచి రిమోట్‌గా నడుపుతున్నారు.

ఈ వ్యూహంతో తొలిసారిగా శత్రు శిబిరంపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. నేలపై రోబోలు, ఆకాశంలో డ్రోన్ల సహకారంతో ప్రత్యర్థి సైనికులను బందీలుగా పట్టుకున్నట్లు తెలిపింది. ఈ ఆపరేషన్‌లో తన పదాతిదళ సైనికులు ఎవరూ ప్రత్యక్షంగా పాల్గొనలేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది.

ఈ విజయం తర్వాత ‘ఎన్‌సి13’ అనే సైనిక విభాగంలో రోబోలను మరింతగా ఉపయోగించాలని నిర్ణయించింది. మానవ సైనికుల స్థానంలో రోబోలను ప్రవేశపెడుతోంది.

ఇక సరిహద్దు ప్రాంతాల్లో శత్రు డ్రోన్ల కార్యకలాపాలు పెరగడంతో పదాతిదళ సైనికులకు తీవ్ర ముప్పు ఏర్పడింది. దీన్ని తట్టుకోవడానికి ఉక్రెయిన్ పరిశోధకులు భూమి మీద నడిచే రోబోటిక్ వాహనాలు, చక్రాలు, లోహ బెల్టులతో కూడిన రిమోట్ కంట్రోల్ వాహనాలు అభివృద్ధి చేశారు. మొదట గాయపడిన సైనికులను వెనక్కి తీసుకురావడం, సరకులు సరఫరా చేయడం వంటి పనులకు వీటిని వాడేవి. క్రమేపీ ఇప్పుడు దాడి కార్యకలాపాలకు కూడా ఉపయోగపడుతున్నాయి.

ఈ కొత్త సాంకేతికత యుద్ధరంగాన్ని మార్చేస్తోందని ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు.

Tags: