డోనాల్డ్ ట్రంప్ కి ఏమైంది?
- ప్రపంచ దేశాలతో పొలిటికల్ గేమ్స్
- అమెరికాను అప్పుల్లోకి దింపుతూ కల్లబొల్లి కబుర్లు
- ప్రపంచంలో ట్రేడ్ వార్ సృష్టించిన ఘనుడు
- అమెరికా ఫస్ట్ అంటూ నానా హంగామా
- కెనడా, ఉక్రెయిన్, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ లకు బెదిరింపులు
- అణు యుద్ధం రాకుండా ఆపానంటూ కథలు
- హార్వర్డ్ కు నిధుల కోత.. విదేశీ స్టూడెంట్ల వీసా ప్రోగ్రాం రద్దు
- నోబెల్ పీస్ ప్రైజ్ కోసమా?
- కీర్తి కండూతి కోసం జియో పొలిటికల్ పాలిటిక్స్?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్నాక విశ్వరూపం చూపిస్తున్నారు. మిత్రదేశాలతో స్నేహం మాని కయ్యమే బాటగా అడుగులు వేస్తున్నారు.అమెరికా చాలా గొప్పదని, ప్రపంచంలోకే పేరున్న దేశమని చెబుతున్నారు. అమెరికా పరువు,ప్రతిష్టలను సమున్నతంగా నిలబెట్టడానికి తాను ఎంతో శ్రమ పడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. అందుకు వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్లో జరుగుతున్న మీటింగులే తార్కాణం. ఎన్నడూలేని విధంగా టీవీ షోలు, ఆరోపణలకు సాక్ష్యాలు చూపిస్తూ అమెరికా ఫస్ట్ డామినేషన్ ను చూపించడానికి నానా పాట్లు పడుతున్నారు. తనను కలిసేందుకు వచ్చే వివిధ దేశాల నేతలతో గొడవ పడుతున్నారు. వాళ్లకి వార్నింగులిస్తున్నారు. రకరకాల హెచ్చరికలు చేస్తున్నారు.ట్రంప్ గెలిచాక చాలా మంది దేశాధిపతులు ట్రంప్ దెబ్బకు అమెరికా వైపు చూడాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కెనడా, ఉక్రెయిన్, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ ఇలా ఏ దేశం నేతపైనైనా నోరు పారేసుకుంటున్నారు.గెలిచాక కలిసేందుకు వచ్చిన కెనెడా ప్రధాని మార్క్ కార్నీని చులకన చేసి మాట్లాడారు. ఎప్పటికైనా కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా మారాల్సిందేనని పరోక్షంగా హెచ్చరించారు. ఎవరిపైనైనా ఆధిపత్యం సాధించాలంటే వారిని డామినేట్ చేయడమే లెక్కగా అడుగులేస్తున్నారు. మొన్నటికి మొన్న ఉక్రెయిన్ నేత జెలెన్ స్కీతో సమావేశం ఇలాగే రసాభాసగా మార్చేశారు. వైట్ హౌస్ చరిత్రలోనే ఇలా దేశాధినేతలతో గొడవ పడిన సందర్భాలు లేవని, ఇదే తొలిసారి అని వార్తలు వస్తున్నాయి.
ఉక్రెయిన్ వనరులపై కన్ను..
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం సమసిపోయేందుకు ప్రయత్నిస్తున్నానంటూనే ఉక్రెయిన్ లో అపారంగా ఉన్న ఖనిజ సంపదపై కన్నేశారు.యుద్ధం ఆపాలని రష్యాను ఒప్పించాలన్నా, లేక ఉక్రెయిన్ కు ఆర్థిక, ఆయుధ సరఫరా చేయాలన్నా ఆ దేశంలో అపారంగా ఉండే ఖనిజ నిల్వలు తాము తవ్వుకు తీసుకు పోయేందుకు అనుమతి ఇవ్వాల్సిందేనన్నారు. ఉక్రెయిన్ అధినేత జలన్ స్కీని బెదిరించి, భయపెట్టారు. ఇంటికి పిలిచిన అతిధిని అవమానించినట్లు చర్చలకు వచ్చిన జెలన్ స్కీని నానా మాటలూ అని తన నోటి దురుసుతనం ప్రదర్శించి పంపారు. అమెరికా అండ చూసుకుని ఇన్నాళ్లు రెచ్చిపోయిన ఉక్రెయిన్ చేసేదేంలేక ఆలోచించుకుని చివరకు ఖనిజ సంపదను తాకట్టు పెట్టయినా యుద్ధంకోసం అమెరికా ఫండింగ్, సాయం కోసం ఎగబడింది. ఇక ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నేతన్యాహుతో సైతం ఇదే ధోరణి. గాజాస్ట్రిప్ ను తన సొంతం చేయమని అప్పగించమని అడుగుతున్నారు. అక్కడి ప్రజలను లెబనాన్, లేదా లిబియాలకు వలస పొమ్మంటున్నారు. గాజాలో పునర్నిర్మాణ పనులు చేపడతానని ప్రజలు సుఖంగా జీవించడానికి టవర్లు కడతానని కబుర్లు చెబుతున్నారు. ట్రంప్ ఒత్తిళ్లకు నేతన్యాహు ఏ మేరకు అంగీకరిస్తారో చూడాలి. ఈ కోరిక వెనక ఓ కనిపించని ఎజెండా ఉంది. పశ్చిమ దేశాల పై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, పశ్చిమాసియా దేశాలను ఓ కంట కనిపెట్టడానికి వ్యూహాత్మకంగా గాజా అత్యంత అనుకూలమైన స్థావరం. అది స్వాధీనం చేసుకుంటే అమెరికా పట్టు పెరుగుతుంది.
అమెరికా ఏ దేశానికి సాయం చేసినా దానికో కారణం ఉంటుంది. దాని వెనక కనపడని రాజ్య కాంక్ష ఉంటుంది. దురాక్రమణ పోకడ ఉంటుంది. సహజ వనరులను కొల్లగొట్టడం, ద్వారా దేశాల మధ్య తగువులు పెట్టి ఆయుధాలను అమ్మి యుద్ధాలకు ఎగదోయడం, ఆపై తానే మధ్యవర్తిత్వం నెరపి ఇద్దరి మధ్యా సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు డ్రామా క్రియేట్ చేయడం అమెరికా సహజ లక్షణం. తన పెద్దన్న పోకడలతో అగ్రరాజ్యమన్న అహంకారంతో అమెరికా వ్యవహరిస్తుంది.
ట్రంప్ చీప్ టాక్టిక్స్..
చివరకు మొన్నటికి మొన్న భారత, పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలను, అణుయుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ ప్రచారం చేసుకున్నారు. ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమని అంటూనే ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్ కు ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయించారు.ఈ విషయంలో భారత్ వినతిని కనీసం పరిగణనలోకి తీసుకోలేదు.భారత అధికారులను సంప్రదించకుండానే భారత్,పాక్ మధ్య తలెత్తిన పెహల్గాం ఉద్రిక్తతలను తానే చల్లార్చినట్లు ట్విటర్ సందేశం ద్వారా చెప్పుకున్నారు.
దక్షిణాఫ్రికాకు బెదిరింపులు..
ఇక దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన్ను ఓవల్ ఆఫీస్ లో కూర్చోబెట్టి నేరుగా మాటల దాడితో చెలరేగిపోయారు.శ్వేత జాతీయులను దక్షిణాఫ్రికాలో హతమారుస్తున్నారని, అన్యాయంగా తెల్లజాతి పౌరులు అంతమైపోతున్నారని వేలాది మందిపై ఇదే తరహా దాడులు కొనసాగితే ఆ దేశానికి అందించే ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తామని బెదిరించారు. తెల్లజాతి రైతులను సైతం చంపేస్తున్నారని మారణ హోమం సృష్టిస్తున్నారంటూ ఓ వీడియో ప్లే చేసి మరీ ట్రంప్ చెలరేగారు. ట్రంప్ అలా రెచ్చిపోతున్నా సిరిల్ రామఫోసా చాలా సంయమనం పాటించారు. తన హుందాతనాన్ని నిలబెట్టుకున్నారు.
శాంతి బహుమతి కోసమా?
వీటన్నింటి వెనుకా ట్రంప్ ఎజెండా ఒకటే. రెండున్నరేళ్లలో వచ్చే మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ మెజారిటీ సాధించడమే ధ్యేయం. అప్పటికి తాను ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలన్న తపన. అమెరికా ఫస్ట్ నినాదాన్ని నిజం చేయాలన్న తపన. డాలర్ ఆధిపత్యం నిలబెట్టాలన్న పట్టుదల, తనను ఒక విశ్వ విజేతగా ప్రకటించుకుని తద్వారా నోబెల్ పీస్ ప్రైజ్ సాధించాలన్న కోరిక కావచ్చు. ఇప్పటి వరకూ నలుగురు అమెరికా అధ్యక్షులకు నోబెల్ పీస్ ప్రైజ్ లు వచ్చాయి. ట్రంప్ కూడా ఆ కీర్తి మంతుల జాబితాలోకెక్కాలన్న తపన ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. తమకు పోటీగా ఎదిగే దేశాలంటే ఆయనకు అక్కసు.. విపరీతమైన ద్వేషం. దక్షిణాసియాలో పోటీ పడి ఎదుగుతున్న చైనా, భారత్ లపై టారిఫ్ ల రూపంలో విషం కక్కుతున్నారు.ఈ పెద్దన్న జియో పొలిటికల్ క్రీడను ప్రపంచం మొత్తం ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తోంది.