ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ మరో యేడాది పొడిగింపు

Update: 2025-06-14 10:51 GMT

ఆధార్ కార్డులు అప్‌డేట్‌ చేసుకోవాల్సిన అవసరం ఉన్నవాళ్లందరికీ కేంద్రం మళ్లీ శుభవార్త చెప్పింది. ఆధార్ డాక్యుమెంట్లను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ -యూఐడీఏఐ మళ్లీ పొడిగించింది. వాస్తవానికి ఈ సేవలకు గడువు 2025 జూన్ 14తో ముగియాల్సి ఉండగా, ఇప్పుడది మరో ఏడాది పాటు పొడగించారు. దీంతో ప్రజలకు 2026 జూన్ 14 వరకు తమ ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం లభించింది. ఈ మేరకు యూఐడీఏఐ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేసింది.



ప్రజలకు మరింత సౌకర్యంగా ఉండేలా 'మై ఆధార్' పోర్టల్ ద్వారా ఈ ఉచిత సేవను అందుబాటులో ఉంచారు. ఆధార్ కార్డును తాజా సమాచారంతో అప్‌డేట్‌ చేసుకోవడం ఎంతో కీలకంగా మారింది. వివాహం, ఉద్యోగం, ఉన్నత విద్య వంటి కారణాల వల్ల చిరునామా మారిన వారు లేదా ఆధార్ పొందిన తర్వాత పదేళ్లు పూర్తయిన వారు తప్పనిసరిగా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ ఇప్పటికే సూచించింది. గతంలో ఈ వివరాలు మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రాలకు వెళ్లి రూ. 50 చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆన్‌లైన్‌లో పూర్తిగా ఉచితంగా ఈ ప్రక్రియను చేసుకోవచ్చు.



ఈ ప్రక్రియలో భాగంగా, యూజర్లు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి తమ ఆధార్ నంబర్‌తో లాగిన్ కావాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వారి ఆధార్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అవసరమైతే మార్పులు చేసి, లేదా అన్ని సరిగ్గా ఉన్నాయని ధృవీకరించి తదుపరి దశలోకి వెళ్లాలి. అప్‌డేట్ కావాల్సిన డాక్యుమెంట్లను ఎంపిక చేసి, స్కాన్ కాపీలు అప్‌లోడ్ చేసిన తర్వాత ‘సబ్‌మిట్’ క్లిక్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. చివరికి 14 అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ -యూఆర్‌ఎన్ జారీ అవుతుంది. దీని ద్వారా అప్లికేషన్ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు. ఈ గడువు పొడిగింపు లక్షలాది మంది వినియోగదారులకు మేలు చేస్తుందని యూఐడీఏఐ తెలిపింది. ఆధార్ సమాచారం అప్‌డేట్‌ చేసుకోవడంలో ఇప్పటికీ ఆలస్యం చేస్తున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.


Tags:    

Similar News