ఇరాన్ నుంచి స్వదేశానికి 290 మంది భారత విద్యార్థులు
ఆపరేషన్ సింధూర్ పేరుతో తరలింపు;
ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య తీవ్ర స్ధాయిలో యుద్దం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ లో చదువుకుంటున్న సుమారు వెయ్యి మంది భారతీయ విద్యార్థులను స్వదేశం రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆపరేషన్ సింధు పేరుతో ఇరాన్ నుంచి భారతీయ విద్యార్థులను ఇండియాకు స్పెషల్ ఫ్లైట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తోంది. యుద్దమేఘాలు కమ్ముకున్న పరిస్ధితుల్లో ఇరాన్ తన గగన తలాన్ని మూసి వేసింది. అయితే కేవలం భారతీయ విద్యార్థులను స్వదేశానికి పంపించడానికి వీలుగా ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తివేసి ఇండియాకు సహకరించింది. ఇప్పటి వరకూ దాదాపు 290 మంది విద్యార్థులను ఇరాన్ నుంచి ఇండియాకు తీసుకు వచ్చారు. వీరందరూ కూడా జమ్మూకశ్మీర్కు చెందిన వారే. ఇప్పటి వరకూ మూడు విమానాల ద్వారా విద్యార్థులను స్వదేశానికి తరలించారు. ఇజ్రాయెల్ దేశం ఇరాన్ పై మిస్సైళ్ళ వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో టెహ్రాన్ లో ఉన్న భారతీయులను రక్షణ నిమిత్తం మషద్ కు తరలించారు. ఇరానియన్ ఎయిర్ లైన్స్ మహన్ భారతీయులను తరలిస్తోంది. అక్కడి నుంచి ఆపరేషన్ సింధు లో భాగంగా గురువారం మొదటి విడత 110 మంది భారతీయ విద్యార్థులను ఢిల్లీకి తీసుకు వచ్చారు. శుక్రవారం మరో రెండు విమానాల్లో180 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. వీరందరినీ దోహా, అర్మేనియా దేశాల మీదుగా భారత్ తీసుకువచ్చారు.