తత్కాల్‌ రైలు టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ తప్పనిసరి

Aadhaar card mandatory for booking Tatkal train tickets;

Update: 2025-06-12 05:04 GMT

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తత్కాల్‌ రైలు టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ఆధార్‌ అథెంటికేషన్‌ చేసిన యూజర్లు మాత్రమే జులై ఒకటో తేదీ నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా తత్కాల్‌ టికెట్లను బుక్‌ చేసుకోగలుగుతారని రైల్వే మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. జులై 15 నుంచి తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ ఓటీపీ తప్పనిసరని పేర్కొంది. ఈ మేరకు మంత్రిత్వశాఖ జారీ చేసిన ప్రకటనలో సిస్టమ్‌ జనరేటెడ్‌ ఓటీపీ ధ్రవీకరించిన తర్వాత మాత్రమే తత్కాల్‌ టికెట్లు భారతీయ రైల్వేల కంప్యూటరైజ్డ్‌ పీఆర్‌ఎస్‌ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్) కౌంటర్లు, ఏజెంట్ల ద్వారా బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ ఓటీపీసీ బుకింగ్ సమయంలో వినియోగదారులు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు సిస్టమ్ ద్వారా పంపబడుతుందని పేర్కొంది. జులై 15 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. తత్కాల్‌ బుకింగ్‌ విండో తొలి అర్ధగంటలో భారతీయ అధీకృత టికెటింగ్‌ ఏజెంట్లు రైలు టికెట్లను బుక్‌ చేసుకునేందుకు అనుమతి ఉండదని సర్క్యులర్‌లో పేర్కొంది.

అరగంట ఆలస్యంగా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఏసీ రైలు టికెట్లు ఉదయం 10 గంటలకు తత్కాల్‌ టికెట్లు ఓపెన్‌ అవుతుండగా.. ఏజెంట్లకు ఉదయం 10.30 గంటలకు నుంచి.. నాన్‌ ఏసీ టికెట్ల ఉదయం 11 గంటలకు బదులుగా.. 11.30 గంటల నుంచి బుక్‌ చేసేందుకు అనుమతి ఉంటుందని చెప్పింది. ఈ మేరకు అన్ని జోనల్‌ రైల్వేలకు సమాచారం ఇవ్వాలని రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (CRIS), IRCTCని మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఈ మార్పులను సాధారణ ప్రజలపై వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది.వాస్తవానికి భారతీయ రైల్వేలో తత్కాల్‌ టికెట్లకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నది. అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేసే వారి కోసం రైల్వేశాఖ తత్కాల్‌ టికెట్లను తీసుకువచ్చింది. అయితే, పలువురు దళారులు, బుకింగ్‌ ఏజెంట్లు దుర్వినియోగం చేస్తున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది. టికెట్ల యూజర్లకు దక్కకుండా క్షణాల్లోనే కోటా ముగుస్తుండడంతో రైల్వేశాఖ ఈ విషయంలో దృష్టి సారించింది. ఇందులో భాగంగా దళారులు, ఏజెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు కొత్తగా నిబంధనలు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో పాటు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ప్రక్రియ అమలులోకి తీసుకువచ్చింది.

Tags:    

Similar News