Ajit Pawar in Heated Argument with Woman IPS Officer: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరియు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య జరిగిన తీవ్రమైన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సోలాపుర్‌లోని ఓ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకునేందుకు అంజనా కృష్ణ తీసుకున్న చర్యలు ఈ వివాదానికి కారణమని సమాచారం.

కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో రోడ్డు నిర్మాణం కోసం అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. ఈ ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు ఆమె రెండు రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు, గ్రామస్థులు అధికారులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంలో ఓ కార్యకర్త అజిత్ పవార్‌కు ఫోన్ చేసి, ఆ ఫోన్‌ను అంజనా కృష్ణకు అందించారు. ఇసుక తవ్వకాలపై చర్యలు ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. ఈ సంభాషణ ఇలా సాగింది:

పవార్: "నేను ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్. మీ చర్యలను వెంటనే ఆపండి."

అంజనా కృష్ణ: "మీరు చెబుతున్నది నాకు అర్థమైంది. కానీ, నేను మాట్లాడుతున్నది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా? దయచేసి నా నంబర్‌కు వీడియో కాల్ చేయండి."

పవార్: "నీకు ఎంత ధైర్యం? నీపై చర్యలు తీసుకుంటాను. నన్ను వీడియో కాల్‌లో చూడాలనుకుంటున్నావా? నీవు నాకు వీడియో కాల్ చేయి."

అనంతరం, అంజనా కృష్ణ పవార్‌కు వీడియో కాల్ చేశారు. అప్పుడు కూడా ఆయన చర్యలు తక్షణమే ఆపాలని ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. పవార్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే స్పందిస్తూ, పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, కార్యకర్తలను శాంతింపజేయడానికి మాత్రమే ఆయన అంజనా కృష్ణను మందలించి ఉండవచ్చని తెలిపారు. ఆమె విధులను పూర్తిగా అడ్డుకోవాలని పవార్ ఉద్దేశం కాదని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆయన ఎప్పుడూ మద్దతివ్వరని స్పష్టం చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు అంజనా కృష్ణతో సహా ఇతర అధికారులు నిరాకరించారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు.

Tags: