90 ఏళ్ల వయస్సులో ఒక్కటైన జంట

Update: 2025-06-09 04:33 GMT

రాజస్తాన్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పెళ్ళి జరిగింది. డబ్బై ఏళ్లుగా సహజీవనం చేస్తున్న జంటకు ఊరంతా కలిసి ఎట్టకేలకు  పెళ్లి చేశారు. ఘనంగా ఊరేగింపు, బరాత్ జరిపి 90 ఏళ్ల వధువుకు 95 ఏళ్ల వరుడికి పెళ్లి తంతు నిర్వహించారు. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని దుంగార్పూర్‌ జిల్లా గలందర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. వీరి వివాహ వేడుకల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లా గలందర్ అనే గిరిజన గ్రామంలో గత 70 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న వృద్ధ దంపతులకు ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లి జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, మనవలు ఉన్నారు. వీరందరి సమక్షంలో జీవాలి దేవి (90) మెడలో రమాభాయ్‌ అంగారి (95) మూడు ముళ్లు వేసి ముసిముసిగా నవ్వుతూ సిగ్గులొలకబోశారు. అధికారికంగా వివాహం జరగనప్పటికీ ఈ జంట ఆరుగురు సంతానంకి జన్మ ఇచ్చారు. ఇందులో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. వృద్ధ జంట పెద్ద కుమారుడికి 60 ఏళ్లు. వీరి పిల్లలకు కూడా వివాహాలు జరిగి కుటుంబాలుగా ఏర్పడ్డారు. దాదాపు జీవిత చరమాంకంలో ఏడు దశాబ్ధాల అనంతరం పెళ్లిముచ్చట తీర్చుకోవాలని ఆశపడిన ఈ జంట తమ కుమారులకు విషయం చెప్పారు.గ్రామపెద్దలు, కుటుంబసభ్యులు అందరూ కలిసి జూన్‌ 1న హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలు మొదలు పెట్టి జూన్‌ 4వ తేదీన ఇద్దరికీ పెళ్లి చేసి డీజే పాటలు, నృత్యాలతో ఊరంతా ఊరేగించారు. ఈ ఉత్సవాల్లో బిందౌలి (వివాహానికి ముందు జరిగే సాంప్రదాయ ఊరేగింపు), సంగీతం, నృత్యం, ఆచారబద్ధమైన సాత్ ఫేరే (అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణలు) కూడా ఉన్నాయి. ఈ నూతన వధూవరుల వివాహ వేడుకకు ఊరంతా విచ్చేసి ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. కాగా పెళ్లి బంధంతో పనిలేకుండా స్త్రీ, పురుషుల పరస్పర అంగీకారంతో కలిసి జీవించే 'నత ప్రథ' అనే ప్రాచీన సంప్రదాయం రాజస్థాన్‌లో ఇప్పటికీ పలు చోట్ల అమలులో ఉంది.

Tags:    

Similar News