Supreme Court Expresses Concern: డిజిటల్ మోసాలు భారీ చోరీలుగా : సుప్రీం కోర్టు ఆందోళన

సుప్రీం కోర్టు ఆందోళన

Update: 2026-02-10 06:09 GMT

రూ.54 వేల కోట్లకు పైగా దేశ ఆస్తి దోచుకున్న సైబర్ మోసాలు, కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు


Supreme Court Expresses Concern: దేశవ్యాప్తంగా డిజిటల్‌ అరెస్టు మోసాల రూపంలో భారీ దోపిడీలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ముమ్మాటికీ ‘బందిపోటు దోపిడీలు, భారీ చోరీలు’ అని వ్యాఖ్యానించింది. ఇటీవలి కాలంలో డిజిటల్ మోసాల ద్వారా రూ.54 వేల కోట్లకు పైగా సొమ్ము దోచుకోబడినట్లు స్పష్టమైందని పేర్కొంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం (జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్‌ ఎన్‌.వి. అంజారియా) సుమోటోగా ఈ విషయంపై విచారణ చేపట్టింది. డిజిటల్ అరెస్టు మోసాలు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం లేదా నేరగాళ్లతో కుమ్మక్కు కావడం వల్లే జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసింది.

2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబరు వరకు దేశంలో రూ.52 వేల కోట్లకు పైగా సైబర్ మోసాలు జరిగినట్లు హోంశాఖ నివేదికలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తూ, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఇది అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తం. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం పడుతుందో ఊహించవచ్చు’’ అని అన్నారు.

ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌బీఐ, బ్యాంకులు, టెలికాం శాఖలతో సంప్రదించి డిజిటల్ మోసాలను అరికట్టేందుకు పకడ్బందీ ‘ప్రామాణిక నిర్వహణ విధానం’ (ఎస్‌ఓపీ) రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా హోం శాఖ ఈ విషయంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించింది.

అలాగే దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్టు కేసులను గుర్తించేందుకు సీబీఐని ఆదేశించింది. దిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలు సీబీఐకు విచారణ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని స్పష్టం చేసింది. బాధితులకు పరిహార విధానం రూపొందించేందుకు ఆర్‌బీఐ, టెలికాం శాఖలు సమావేశమై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

పింఛను రూ.15-20 వేలు తీసుకునే వ్యక్తి ఖాతా నుంచి ఒక్కసారిగా రూ.50 లక్షలు లేదా కోటి రూపాయలు విత్‌డ్రా అవుతుంటే బ్యాంకుల ఏఐ టూల్స్ ఎందుకు అప్రమత్తం చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. బ్యాంకుల వ్యవస్థలోని లోపాలను కూడా ఈ సందర్భంగా గుర్తుచేసింది.

ఈ ఆదేశాలతో డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కీలక చర్యలు ప్రారంభమవుతాయని అంచనా వేయవచ్చు.

Tags:    

Similar News