భారతదేశంలో ఎలాన్‌మస్క్‌ ఇంటర్నెట్‌

Update: 2025-06-06 11:49 GMT

భారత దేశంలో ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌ సంస్థ ఇంటర్‌నెట్‌ సర్వీసులకు అనుమతులు లభించాయి. ఇక.. దేశంలో స్టార్‌లింక్‌ సర్వీసులు ప్రారంభించడమే తరువాయి. ఫలితంగా దేశంలో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు స్టార్‌లింక్‌ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ సర్వీసులు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్సును కేంద్ర టెలికాం విభాగం మంజూరు చేసింది.



స్టార్‌లింక్‌ కంపెనీకి ఇప్పుడే అనుమతులు లభించగా.. ఇంతకుముందే మరో రెండు కంపెనీలకు ఈ శాటిలైట్‌ ఇంటర్‌నెట్‌ సర్వీసులకు సంబంధించిన అనుమతులు వచ్చాయి. యులెల్సాట్‌ వన్‌ వెబ్‌, రిలయను్స్‌ జియో సంస్థలు ఇప్పటికే ఈ శాటిలైట్‌ వెబ్‌సైట్‌ సర్వీసులకు అనుమతులు తీసుకోగా.. ఈ తరహా అనుమతులు తీసుకున్న మూడో కంపెనీగా స్టార్‌ లింక్‌ నిలిచింది. ఈ కంపెనీలు దరఖాస్తు చేసుకున్న 15 నుంచి 20 రోజుల్లోనే ట్రయల్‌ స్పెక్ట్రమ్‌ మంజూరు చేస్తామని టెలికాం డిపార్ట్‌మెంట్‌ వర్గాలు తెలిపాయి.




ప్రపంచ అపర కుబేరుడిగా పేరొందిన ఎలాన్‌ మస్క్‌కు సంబంధించిన స్పేస్‌ ఎక్స్‌ అనుబంధ సంస్థ అయిన స్టార్‌ లింక్‌ ఇప్పటికే పలు దేశాల్లో శాటిలైట్‌ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. సుదూర భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే సంప్రదాయ ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా.. లియో (లో ఎర్త్‌ ఆర్బిట్‌) ఉపగ్రహాల ద్వారా స్టార్‌ లింక్‌ ఈ సర్వీసులను అందిస్తోంది. భూమికి 550 కిలోమీటర్లు ఎత్తులో ఉండే కక్ష్యలో స్టార్‌లింక్‌కు చెందిన 6,000 ఉపగ్రహాలు పరిభ్రమిస్తుంటాయి. భూమి నుంచి ఈ ఉపగ్రహాలు తక్కువ దూరంలో ఉండడం వల్ల తక్కువ లేటెన్సీతో ఇంటర్నెట్‌ సేవలను పొందే అవకాశం ఉంటుంది. మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు స్టార్‌ లింక్‌ ఉపయోగపడుతుంది. ఇప్పటికే 100కు పైగా దేశాల్లో ఈ శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్ సర్వీసులు లభిస్తున్నాయి. త్వరలో భారతదేశం‌ కూడా ఈ లిస్టులో చేరబోతోంది.




Tags:    

Similar News