ఐదు చోట్లు పేలుళ్లు - 12 మంది మానవ బాంబులు?
ఉగ్రవాద గ్రూపు ఐసిస్తో సంబంధాలు కొనసాగిస్తున్న స్లీపర్ సెల్ సిరాజ్ విచారణలో పలు కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. న్యాయస్థానం అనుమతితో సిరాజ్ను కస్టడీలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు అతన్ని ప్రశ్నిస్తూ పలు రహస్యాలు రాబడుతున్నారు. పోలీసులు, ఎన్ఐఏ అధికారులు సిరాజ్ను ఐదు రోజులుగా విచారిస్తున్నారు. దీంతో, తన గ్రూపులో ఉన్న టీమ్ మెంబర్స్ వివరాలను సిరాజ్ బయట పెట్టాడు. అహిం గ్రూపులో ప్రధానంగా 12 మంది ఉన్నట్లు వాళ్ల వివరాలు వెల్లడించాడు సిరాజ్. అయితే వాళ్లను సిరాజ్ మానవ బాంబులుగా తయారు చేశాడన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాళ్ల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. వారిలో ప్రధానంగా వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బారాదర్ కోసం వెతుకుతున్నారు. సిరాజ్, సమీర్ ముంబైకి వెళ్లి ఆ 12 మందితో సమావేశమైనట్లు గుర్తించారు. ముంబై సమావేశం వివరాలు డీకోడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక, ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్ బాంబు పేలుళ్ల కోసం మొత్తం ఐదు చోట్ల రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. విజయనగరంతో పాటు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాలలో బాంబు పేలుళ్ల కోసం రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇద్దరు నిందితులను ఇటీవల హైదరాబాద్, విజయనగరంలో అరెస్టు చేశారు. ఆ సమయంలో కేవలం హైదరాబాదులో పేలుళ్ల కోసం విజయనగరంలో ప్లాన్ చేసినట్టుగా అధికారులు భావించారు. కానీ ఎన్ఐఏ అధికారుల విచారణలో నాలుగైదు రాష్ట్రాల్లో బాంబు దాడులకు నిందితులు ప్లాన్ చేసినట్టు తేలింది. దిల్సుఖ్నగర్లో దశాబ్దం కిందట జరిగిన టిఫిన్ బాక్స్ బాంబు దాడి లాంటి వాటికి నిందితులు కుట్ర చేశారు. నిందితులు సోషల్ మీడియా లో గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూపులో మొదట ఆరు గురు ఉన్నారని అధికారులు భావించారు. కానీ మొత్తం 12 మంది నిందితులు ఆ సోషల్ మీడియా గ్రూపులో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అందులోనే నిందితులు తమ ప్లాన్, ఇతర చర్చలు జరిపేవారు. ఈ నిందితులు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందినవారు. నిందితుల సోషల్ మీడియా అకౌంట్లు, అహీమ్ సంస్థ మూలాలతో పాటు వారికి ఇటీవల వచ్చిన విదేశీ కాల్స్పై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. వీరికి సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు రావడంతో బాంబుదాడులకు టిఫిన్ బాక్స్, పేలుడు పదార్థాలు సైతం కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడయింది. సౌదీ నుంచి వచ్చిన నిధులు ఏ ఖాతాలో జమయ్యాయి? వాటిని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? అనే దానిపై ఎన్ఐఏ అధికారులు కూపీ లాగుతున్నారు.