వృద్ధులకు అన్ని ఆస్పత్రుల్లో ఫ్రీ ట్రీట్మెంట్
దేశంలోని 70 ఏళ్ల పైబడిన వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా ఆదాయంతో సంబంధం లేకుండా వృద్ధులు ఇప్పుడు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స పొందవచ్చు. ఆయుష్మాన్ వయా వందన యోజన పథకం కింద వృద్ధులకు ఏకంగా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుంది. పాత అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా మొదటి రోజు నుంచే ఆసుపత్రుల్లో చికిత్స అందుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు.
ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం ఎవరైనా ఈజీగా మొబైల్ ఫోన్ ద్వారానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ముందుగా ఆయుష్మాన్ భారత్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి.. ఓటిపి ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ రాష్ట్రం పేరు, ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. కనిపించిన లిస్టులో మీ పేరు లేకపోతే వెంటనే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఓటిపి ఆధారంగా ఈ కేవైసీ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చి, డిక్లరేషన్ సమర్పిస్తే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
70యేళ్లు పైబడిన వృద్ధులే కాకుండా.. ఇంట్లో ఉండే కుటుంబసభ్యుల వివరాలన్నీ ఈ యాప్లో యాడ్ చేసుకోవచ్చు. అన్ని వివరాలు ఎంటర్ చేసిన తర్వాత చివరగా సబ్మిట్ చేయాలి. ఆ వెంటనే యాప్ నుంచే కార్డును కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా వృద్ధులకు పూర్తి ఉచితంగా అన్ని ఆసుపత్రుల్లో చికిత్సకు అవకాశం కల్పించడం వల్ల పెద్ద వయసులో వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయి.