దుబాయ్ బంగారం దిగుమతిపై భారత్ కఠిన ఆంక్షలు
దుబాయ్ నుంచి భారత్కు దిగుమతి చేసుకునే బంగారం, వెండిపై భారత ప్రభుత్వం తీవ్రమైన ఆంక్షలు విధించింది. ముడి బంగారం, వెండితో పాటు.. పాక్షికంగా తయారైన అంటే.. సెమీ మ్యాన్యుఫాక్చర్ ఆభరణాఉల, పొడి రూపంలో ఉన్న బంగారం, వెండి దిగుమతుల విషయంలో కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. భారత్-దుబాయ్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ కొత్త నిర్ణయానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.
సెపా ఒప్పందంలో ఉన్న వెసులు బాట్లను కొందరు కొందరు దిగుమతిదారులు అనుకూలంగా మలచుకొని.. తక్కువ టాక్స్లు చెల్లించేలా బంగారాన్ని ప్లాటినం మిశ్రమంగా చూపిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ విధమైన మోసాలను అరికట్టేందుకు కొత్తగా ఈ ఆంక్షలను రూపొందించినట్లు సమాచారం. ఈ యేడాది బడ్జెట్ ప్రకటనలో భాగంగా బంగారం డోర్, వెండి డోర్, అధిక స్వచ్ఛత గల ప్లాటినం వంటి కీలక వస్తువులకు కొత్త హార్మోనైజ్డ్ సిస్టమ్-హెచ్ఎస్ కోడ్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
కొత్తగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను బట్టి చూస్తే.. ఇకపై నామినేటెడ్ ఏజెన్సీలు, అర్హత కలిగిన నగల వ్యాపారులు, సెపా ఒప్పందం కింద చెల్లుబాటు అయ్యే టారిఫ్ రేట్ కోటా -టీఆర్క్యూ హోల్డర్లు మాత్రమే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఈ నిర్దిష్ట రూపాల్లో ఉన్న బంగారం, వెండిని దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. భారత్-దుబాయ్ సెపా ఒప్పందం కింద, టీఆర్క్యూ విధానంలో యూఏఈ నుంచి ఏటా 200 మెట్రిక్ టన్నుల వరకు బంగారాన్ని ఒకశాతం టాక్స్ రాయితీతో ఇంపోర్ట్ చేసుకునేందుకు భారత్ అంగీకరించింది.
అయితే, కొందరు దిగుమతిదారులు దాదాపు 99% మేలిమి బంగారాన్ని కూడా ప్లాటినం మిశ్రమంగా చూపిస్తూ.. సెపా కింద తక్కువ దిగుమతి టాక్స్లను చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి దుర్వినియోగాన్ని నిరోధించేందుకు, ప్రభుత్వం 99% లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛమైన ప్లాటినం ఉన్న దిగుమతులకు ప్రత్యేకంగా ఒక కొత్త హెచ్ఎస్ కోడ్ను ప్రవేశపెట్టింది. కేవలం ఈ కేటగిరీ కింద జరిగే దిగుమతులకు మాత్రమే టాక్స్లలో రాయితీలు వర్తిస్తాయి. ఇతర ప్లాటినం మిశ్రమాల దిగుమతులపై మాత్రం ఆంక్షలు అమలవుతాయి. దీనివల్ల ప్లాటినం ముసుగులో బంగారం దిగుమతి చేసేందుకు ఉన్న మార్గాలకు అడ్డుకట్ట పడినట్లు అయ్యింది.