Omar Abdullah: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంగళవారం బీజేపీని సవాల్ చేస్తూ, యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని సూచించారు. సంఖ్యాబలం ఉంటే పార్లమెంట్‌లో తీసుకురండి, రాష్ట్రాల ద్వారా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

‘‘సంఖ్యాబలం ఉంటే పార్లమెంట్‌లో తీసుకురండి. రాష్ట్రాల ద్వారా ఎందుకు చేస్తున్నారు? వారి స్వంత ఎన్‌డీఏలోనే అందరూ అంగీకరించడం లేదు. జనతాదళ్ (యునైటెడ్) బీహార్‌లో దీన్ని అమలు చేయమని చెప్పిందని వార్తలు వస్తున్నాయి’’ అని ఒమర్ అబ్దుల్లా మీడియాతో అన్నారు.

యూసీసీని వెనుక తలుపు ద్వారా తీసుకురావద్దని హెచ్చరించారు. స్వంత మిత్రపక్షాలే వ్యతిరేకిస్తున్నందున పార్లమెంట్‌లో ఆమోదం పొందడం కష్టమని, అందుకే రాష్ట్రాల మార్గం ఎంచుకున్నారని అన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అమలు చేస్తే అది సార్వత్రిక చట్టం కాదని స్పష్టం చేశారు. ‘‘దేశమంతా బీజేపీ పాలనలో లేదు. ఇలాంటి విషయాలు వ్యక్తిగత రాష్ట్రాలు నిర్ణయించకూడదు. దేశం మొత్తం తరఫున పార్లమెంట్ నిర్ణయించాలి’’ అని చెప్పారు.

‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’, రిజర్వేషన్ వంటి కీలక బిల్లులను కూడా పార్లమెంట్‌కు తీసుకురాలేదని, ఇప్పుడు యూసీసీని కూడా రాష్ట్రాల ద్వారా చేయాలని చూస్తున్నారని విమర్శించారు.

ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తత తగ్గడం స్వాగతించదగిన అడుగని, ఎల్‌ఓసీ వద్ద కూడా పరిస్థితి మెరుగుపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైనదని, ఇతర దేశాల సర్టిఫికెట్లు అవసరం లేదని అన్నారు. బ్రిక్స్ సదస్సులో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించడం భారత విదేశాంగ విధాన విజయమని పేర్కొన్నారు.

Tags: