Amit Shah: ఇస్కాన్ సంస్థ మానవ సేవలో ముందుకు సాగుతోంది: అమిత్ షా
ముందుకు సాగుతోందిడి: అమిత్ షా
Amit Shah: సనాతన ధర్మ సూత్రాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఇస్కాన్ సంస్థ నిర్విరామంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. మానవాళికి సేవ చేయడాన్ని ఉన్నత లక్ష్యంగా ఎంచుకుని, ఆ దిశగా అనేక కార్యక్రమాలను చేపట్టిందని ఆయన అభినందించారు. పశ్చిమ బెంగాల్లో పర్యటనలో ఉన్న అమిత్ షా.. నదియా జిల్లాలోని మాయాపుర్లో ఇస్కాన్ ముఖ్య కేంద్రంలో జరిగిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకుర్ 152వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ప్రభుత్వ అధికారిగా కాకుండా, చైతన్య మహాప్రభు భక్తుడిగా ఇక్కడికి వచ్చానని చెప్పారు. ‘‘దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు ఇస్కాన్ ప్రభావాన్ని స్వయంగా చూశాను. మీరు ప్రచురించిన భగవద్గీత పుస్తకాలు అన్ని వయసులవారికీ, అన్ని తరగతులవారికీ ఉపయోగపడుతున్నాయి. అయితే ఇస్కాన్ భక్తి మార్గంలోనే ఆగిపోలేదు. ఎక్కడైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మొదటి స్పందనగా అక్కడికి చేరుకుని సహాయం అందిస్తోంది. ఆహార వితరణ కేంద్రాలు స్థాపించడం, పేదలకు విద్యా, వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.