మేకిన్ ఇండియా మార్వెల్.. మాధవి సృష్టి!!

Update: 2025-06-09 10:30 GMT
  • ప్రపంచ సరికొత్త వింత!!
  • చినాబ్.. తెలుగు బిడ్డ కృషి!!
  • చినాబ్ బ్రిడ్జి కోసం 17 ఏళ్లు కష్టపడిన తెలుగు బిడ్డ
  • కాకినాడ JNTUలో బీటెక్.. వరంగల్ నిట్ లో ఎంటెక్..
  • బెంగళూరు ఐఐఎస్ సి లో మాధవి ప్రొఫెసర్
  • 272 కి.మీ. పొడవైన ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్
  • అనుమతులు 2003లోనే వచ్చినా ఆలస్యం
  • హిమాలయా పర్వతాలను వంచి వారధి నిర్మాణం
  • అడుగడుగునా అవాంతరాలే..
  • గుర్రాలు, గాడిదలపై ప్రయాణం.. నిర్మాణ సామాగ్రి తరలింపు
  • రాక్ పిల్లర్లు కట్టడం, కొండలను షేప్ చేయడం సంక్లిష్టం
  • సవాళ్లకు అనుగుణంగా డిజైనింగ్ లో మార్పులు
  • ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన 35 మీటర్ల ఎత్తైన నిర్మాణం

జమ్ము కశ్మీర్ లో ప్రపంచంలోకే అత్యంత ఎత్తైన చినాబ్ బ్రిడ్జి ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఆకాశంలో ఇంద్ర ధనుస్సులా నిలబడుతున్న ఈ బ్రిడ్జి ఇప్పుడు ఇండియన్ స్పెషల్ అట్రాక్షన్స్ లో ఒకటి. ఆ మార్గం గుండా ప్రయాణించేవాళ్లు దీనిని తమ వీడియోల్లో బంధిస్తున్నారు.కశ్మీర్ టు కన్యాకుమారి కనెక్టివిటీని ఎట్టకేలకు సాధించాం.. కాశ్మీర్ అందాలను పరిచయం చేసిన ఆ వారధి మనందరికీ ఎంతో ప్రత్యేకమైనది. ఇంత ప్రజాదరణ పొందిన ఈ బ్రిడ్జి నిర్మాణం వెనుక ఓ తెలుగు మహిళ అబ్బుర పరిచే పరిజ్ఞానం దాగి ఉంది.272కిలోమీటర్ల పొడవైన ఉదం పూర్ శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకుకు అనుమతులు వాస్తవానికి 2003లోనే వచ్చాయి.అప్పటినుంచి అనేకాకనేక కారణాలతో ఈ బ్రిడ్జి నిర్మాణం కల సాకారం కాలేదు. ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అది నెరవేరింది.

కొండ కోనల్లో ఓ మహిళ అకుంఠిత తపస్సు!!

ఇది మన భారతీయ ఇంజనీర్ల సమష్టి కృషే అయినా ఇది నెరవేరడానికి మూలకర్త ఓ మహిళ..ఆమే అచ్చ తెలుగు ఆడబిడ్డ.. బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) కు చెందిన ప్రొఫెనర్ జి. మాధవీ లత. ఈ ప్రాజెక్టు కు జియోటెక్నికల్ కన్సల్టెంట్ కింద 17 ఏళ్ల నుంచి ఆమె పనిచేస్తున్నారు.

అసలే అది కొండ ప్రాంతం.. అరిచి గీపెట్టినా నర మానవుడు కనపడడు. అడవుల మధ్య, అడవుల మీదుగా ఎత్తుపల్లాల కొండల నడుమ బ్రిడ్జి నిర్మాణం అంటే ఎంతకష్టం? అత్యంత క్లిష్టమైన ఈప్రాజెక్టును ఆఫ్కన్ సంస్థ చేపట్టింది. బ్రిడ్జి ప్లానింగ్, డిజైన్,నిర్మాణంలో అడుగడుగునా ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి మాధవి నిరంతరం ఆ సంస్థతో కలసి పనిచేశారు.

ఎవరీ మాధవీలత?

IISc బెంగళూరులో HAG ప్రొఫెసర్ గా మాధవి పని చేస్తున్నారు. ఆమె అక్షరాలా తెలుగు మహిళ..గాలి మాధవీలత ప్రాధమిక విద్యాభ్యాసం అంతా ఏపీలోనే జరిగింది. ఆమె కాకినాడ JNTUనుంచి 1992లో సివిల్ ఇంజనీరింగ్ లో బీ టెక్ ఫస్ట్ క్లాస్ లో, డిస్టింక్షన్ లో పాసయ్యారు. అనంతరం తెలంగాణలోని వరంగల్ నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ) నుంచి ఎంటెక్ డిగ్రీ సాధించి గోల్డ్ మెడల్ అందుకున్నారు.జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లో స్పెషలైజేషన్ చేశారు. అదే ఫీల్డులో అంటే జియో టెక్నికల్ ఇంజనీరింగ్ లో ఐఐటి మద్రాస్ నుంచి 2000లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు.ఇన్నేళ్లలో ఎన్నో అవార్డులు సాధించారు.2021లో ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీనుంచి బెస్ట్ విమెన్ జియో టెక్నికల్ రిసెర్చర్ అవార్డును ఆమె అందుకున్నారు.2022లో స్టీమ్(STEAM) సంస్థ ఎంపిక చేసిన టాప్ 75మందిలో మాధవీలత ఒకరు.

చినాబ్ బ్రిడ్జికోసం ఏం చేసారు?

సవాళ్లతో కూడిన భూ భౌగోళిక స్వరూపం, క్షణానికో రకంగా మారిపోయే వాతావరణ పరిస్థితులు, ప్రపంచంతో సంబంధం లేని రిమోట్ ప్రాంతం.. వీటి మధ్య రెండు కొండల మీదుగా ఒక బ్రిడ్జి నిర్మించాలంటే అందునా రైల్వే బ్రిడ్జి నిర్మించాలంటే ఎంత క్లిష్టమైన విషయం?ఇలాంటి సమయంలో మాధవీలత అనుసరించిన మార్గమొక్కటే.. అప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను తట్టుకుంటూ, కొత్తగా తలెత్తే సమస్యలను బేరీజు వేసుకుంటూ తమ ప్లానింగ్ ను పరిస్థితులకనుగుణంగా మార్చుకోడమే. రంగంలోకి దిగేసరికి అక్కడ కొండల తీరులో ఉన్న వ్యత్యాసాలు కొట్టచ్చినట్లు కనిపించాయి. కొన్ని కొండలు సగానికి విరిగి పోయి, మరికొన్నిపైకి కనపడని సొరంగంతో డొల్లగా ఉండటం, రాతి స్వభావం కూడా తేడాగా ఉండటం ఆమెను కలవరపెట్టాయి. ఇవేవీ అంతకుముందు సర్వేలో బయటపడలేదు.

దాంతో మాధవీలత టీమ్ క్లిష్టమైన సవాళ్లను బేరీజు వేసుకుంటూ డిజైనింగ్ లో అప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ పనిచేశారు. ప్రాజెక్టు నిర్మాణం సమయంలోనే కొండల తీరు, వాటి స్వభావం మారుతూ వారికి కనిపించింది. ఇందులో మాధవీలత పాత్ర ఏమంటే కొండ తీరుకు అనుగుణంగా ప్రాజెక్టు షేపును మార్చడం, అలాగే బ్రిడ్జికి ఆధారంగా నిర్మించాల్సిన రాక్ యాంకర్లను ఎక్కడ పెడితే మొత్తం నిర్మాణం పటిష్టంగా, సురక్షితంగా ఉంటుందో అంచనా వేసి టీమ్ ను అలెర్ట్ చేయడం.

ఇంజనీర్లకు సవాల్ విసిరిన ఈ నిర్మాణంపై ఇటీవలే ఒక జర్నల్ కు మాధవీలత పేపర్స్ కూడా సబ్మిట్ చేశారు.“Design as You Go: The Case Study of Chenab Railway Bridge.” అనే టైటిల్ తో జియో టక్నికల్ జర్నల్లో మహిళల పేజీలో ఈ వ్యాసం ప్రచురితమైంది.బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు ఏ షేప్ తీసుకుంటుందో తెలీనంత పజిల్ లా వాళ్లకు అక్కడి వాతావరణం ఉండేది. వీస్తున్న గాలులు, కురుస్తున్న వానలు క్షణాల్లో మారిపోయే వాతావరణం మధ్య అడవులలో కొండల మధ్య ఒక భారీ నిర్మాణం చేపట్టడమంటే ఎంత పెద్ద సవాలో ఊహించుకోవచ్చు. అందుకే పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ మార్చుకుంటూ వచ్చానంటారామె.

ఈబ్రిడ్జి ఎందుకు ప్రత్యేకమంటే..

చినాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం అంత తేలికగా అవలేదు.అసలే అవి హిమాలయ కొండలు.. వాటిని బ్రిడ్జి హైట్ కి కుదించాల్సి రావడం, కొన్ని పడగొట్టే వీలులేని కఠినమైన శిలలు కావడంతో పక్క నుంచి నిర్మించాల్సి రావడం, అందకు కిందనుంచి సపోర్ట్ పిల్లర్లు వేయాల్సి రావడం, ఉథృతంగా వీచే గాలులు... పనులకు అంతరాయం.ఒక్కోసారి గాలుల ఉథృతి అంచనాలకు మించి ఉండటం.. క్షణానికో రకంగా మారే వాతావరణం.

గాడిదలు, గుర్రాలే దిక్కు...

అసలు ప్రాజెక్టు కట్టాల్సిన స్థలానికి నిర్మాణపు సామాగ్రిని తరలించడమే కష్ట సాధ్యమైపోయింది. అసలే అడవీ ప్రాంతం.. దారి లేనే లేదు.అప్పటికప్పుడు దారి చేసుకుంటూ లోపలికి పోవడమే. గాడిదలు, గుర్రాల సాయంతో ప్రాజెక్టు నిర్మాణ సామాగ్రిని తరలించాల్సి వచ్చింది. గాడిదలు, గుర్రాలమీదే ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ కూలీలు లొకేషన్ కు చేరుకున్నారు. కొంత ప్రాధమిక సామాగ్రి అక్కడకు తీసుకు వెళ్లారు. ఆపై నెమ్మదిగా అవి ప్రయాణించిన మార్గంలోనే టెంపరరీ రోడ్లు నిర్మించారు.

చినాబ్ బ్రిడ్జి ప్రత్యేకతలు..

చినాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోకే ఎత్తైన ఈఫిల్ టవర్ కన్నా ఎత్తయినది.ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎత్తు ఎక్కువ. కశ్మీర్ లోయకు కనెక్టివిటీని పెంచే ఈ ప్రాజెక్టు భారతీయ రైల్వే ప్రాజెక్టులలో అత్యంత క్లిష్టమైనది. అతిపెద్ద సివిల్ ఇంజనీరింగ్ ఛాలెంజ్ గా రైల్వే శాఖకు సవాల్ విసిరిన ప్రాజెక్టు ఇది. ఇంతకీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చయ్యిందంటే రూ.1,486 కోట్లు.తొందరలోనే ఇది ప్రపంచ వింతల్లో ఒకటిగా నమోదైన ఆశ్చర్యం లేదేమో. ఒక భారతీయ మహిళ అందునా తెలుగు మహిళ కష్టం, మేథస్సుకు చినాబ్ బ్రిడ్జి సజీవ సాక్ష్యంలా నిలబడుతుంది.ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా నిర్మించినదే!!

Tags:    

Similar News