Mamata Banerjee: మమతా బెనర్జీ నుంచి భాజపా ఎంపీకి బెంగాల్ టాప్ అవార్డు: ఎన్నికల వ్యూహమా?
భాజపా ఎంపీకి బెంగాల్ టాప్ అవార్డు: ఎన్నికల వ్యూహమా?
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు రేగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల భారతీయ జనతా పార్టీ (భాజపా) రాజ్యసభ ఎంపీ నాగేన్ రాయ్కు రాష్ట్ర ఉన్నత పౌర పురస్కారం 'బంగ విభూషణ్' ప్రదానం చేశారు. టీఎంసీ, భాజపాల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఈ నిర్ణయం రాజకీయ హడావుడిని సృష్టించింది. ఎన్నికల ముందు ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు మమతా ఈ అడుగు వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాగేన్ రాయ్ రాజ్భాంగ్షీ సమాజానికి చెందిన ప్రముఖుడు. ఉత్తర మరియు మధ్య బెంగాల్ ప్రాంతాల్లో ఈ సమాజం ప్రజలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. 2011 జనగణన ప్రకారం, ఈ వర్గం జనాభా సుమారు 33 లక్షలుగా ఉంది. ముర్షిదాబాద్, మాల్దా, దార్జిలింగ్, ఉత్తర దినాజ్పుర్, జల్పాయ్గుడి జిల్లాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి ఈ సమాజానికి ఉంది. గత ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో టీఎంసీకు సవాళ్లు ఎదురైతే, భాజపా మాత్రం మంచి ప్రదర్శన చేసింది. ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సమాజం మద్దతును కాపాడుకోవడానికి టీఎంసీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2023లో భాజపా తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన నాగేన్ రాయ్ను తమ సమాజం 'అనంత్ మహారాజ్' అని గౌరవపూర్వకంగా పిలుచుకుంటుంది. ఒకప్పుడు టీఎంసీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ఆయన, తర్వాత భాజపావైపు మొగ్గు చూపారు. 2024లో మమతా బెనర్జీ ఆయన నివాసాన్ని సందర్శించడం గమనార్హం. ఇటీవల రాష్ట్రంలో ఓటర్ల జాబితా 'ప్రత్యేక సమగ్ర సవరణ' (ఎస్ఐఆర్) ప్రక్రియపై నాగేన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సవరణలు తమ సమాజానికి ఇబ్బందికరంగా మారాయని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో 'బంగ విభూషణ్' పురస్కారాన్ని ప్రకటించడం ఎన్నికల ఎత్తుగడగా చూస్తున్నారు.
పురస్కారాల జాబితాలో మొదట్లో నాగేన్ పేరు లేకపోవడం, తర్వాత చేర్చడం వంటి అంశాలు కూడా చర్చనీయాంశాలుగా మారాయి. అయితే, ఈ అవార్డు తనకు రావడం కలలో కూడా ఊహించలేదని నాగేన్ రాయ్ స్పందించారు. పార్టీ మార్పుపై వచ్చిన ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. మొత్తంగా, ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారి తీస్తుందా? అనేది ఎన్నికల సమయం వరకు వేచి చూడాలి.